మండలికి మంగళమే..? పార్లమెంట్ అడ్డుచెప్పకపోవచ్చు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు
ఆంధ్రప్రదేశ్ మండలి రద్దుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ తీర్మానానికి పార్లమెంట్ అభ్యంతరం చెప్పకపోవచ్చని స్పష్టంచేశారు. మండలి రద్దు తీర్మాన ప్రతిని ఏపీ శాసనసభ స్పీకర్ కార్యాలయం కేంద్ర ప్రభుత్వానికి పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
నిబంధనల ప్రకారమే..
ఏదైనా ఒక రాష్ట్రం, చట్ట సభ నిబంధనలకు అనుగుణంగా తీర్మానం చేసి పంపిస్తే పార్లమెంట్ ఆమోదం తెలుపుతోందని జీవీఎల్ నరసింహారావు గుర్తుచేశారు. ఇందులో అధికార పార్టీ ఏదీ, విపక్షం ఏదీ, అనే రాజకీయాలకు తావులేదన్నారు. నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. మండలి రద్దు కోసం ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సూచనలు మాత్రమే...
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచనలు మాత్రమే చేస్తుందని చెప్పారు. అంతేకానీ బిల్లులు మార్పులు, చేర్పుల గురించి ప్రస్తావించే అవకాశం లేదన్నారు. 2013లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పలు సూచనలు చేసిందని గుర్తుచేశారు. వాటిని పార్లమెంట్ మార్గదర్శకాలుగా భావిస్తోందని చెప్పారు. అసెంబ్లీలో 1/3 సభ్యులు లేదంటే ఆ రోజు సభకు హాజరైన సభ్యుల్లో 50 శాతానికి మించి ఉంటే నిబంధనల మేరకు తీర్మానం ఉన్నట్టేనని పేర్కొన్నారు. మండలి రద్దుపై కూడా కేంద్ర ప్రభుత్వం రాజ్యాగంబద్ధంగానే వ్యవహరిస్తోందని చెప్పారు.
ఆర్థికవృద్ధి రేటు పెంచడమే..
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఆర్థికవృద్ధి రేటును పెంచేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. మందగమనం దాటేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ చేశారని.. మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చి మందగమనాన్ని మించేందుకు చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఇండికేషన్స్ ఇచ్చారు.