రోజా సస్పెన్షన్పై మండలి కమిటీ చర్చ: ముద్రగడతో భూమన భేటీ, కాపు పోరుకు మద్దతు
హైదరాబాద్/ కాకినాడ: శాసనసభ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా సస్పెన్షన్, తదితర పరిణామాలపై డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటైన విచారణ కమిటీ మంగళవారంనాడు మూడు గంటల పాటు చర్చించింది.
శీతాకాలం శాసనసభా సమావేశాల్లో చోటు చేసుకున్న సంఘటనలపై కమిటీ చర్చించింది. శాసనసభ వీడియో ఫుటేజీల లీకేజీపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. తిరిగి ఈ నెల 27వ తేదీన సమావేశం కావాలని కమిటీ నిర్ణయించుకుంది. కాగా, రోజాను ఏడాది పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
తునిలో కాపు గర్జన వేదిక వద్ద మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికలకు ముందు కాపులకు ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేర్చాలని భూమన డిమాండ్ చేశారు.
కాపులు చేస్తున్న పోరాటానికి తమ పార్టీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని ఆయన చెప్పారు. చంద్రబాబు అధికారం చేపట్టి 20 నెలలు దాటుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీలతో కాలయాపన చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాపుల హక్కుల సాధన కసోం ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన తునిలో కాపు గర్జన సభ తలపెట్టిన విషయం తెలిసిందే.