జూన్ 3న ఫిరాయించిన ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్ విచారణ, సునీత, శివనాథరెడ్డికి కార్యదర్శి లేఖ...
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్ జూన్ 3న విచారణ జరుగనుంది. ఈ మేరకు శాసనపరిషత్ కార్యదర్శి శుక్రవారం తెలిపారు. పార్టీ విప్ ఉల్లంఘించినందున శివనాథరెడ్డి, పోతుల సునీతపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫిర్యాదు చేశారు. మండలిలో పలు బిల్లులపై విప్కు విరుద్ధంగా ఓటు వేశారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫిర్యాదుపై మండలి కార్యదర్శి స్పందించారు. జూన్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేపడుతామని తెలిపారు. మండలి ఛైర్మన్ ఛాంబర్లో జరిగే విచారణకు హాజరు కావాలని, ఎందుకు అనుకూలంగా వ్యవహరించాల్సి వచ్చిందో వాదనలు వినిపించాలని ఎమ్మెల్సీలకు స్పష్టంచేశారు. ఈ మేరకు వారికి మండలి కార్యదర్శి లేఖ రాశారు.
Recommended Video
ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో విప్ని ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీత, కడప జిల్లాకు చెందిన శివనాథరెడ్డి జనవరి నెలలో జరిగిన ఓటింగ్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. శివనాథరెడ్డి మొదటిసారి ఓటింగ్లో ప్రభుత్వానికి అనకూలంగా నిలబడ్డారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకు శివనాథరెడ్డి. తమకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, అందుకే పార్టీ మారామని సునీత తెలిపారు. అయితే ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి అనుకూలంగా ఓటేయడంతో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండలి కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కార్యదర్శి స్పందించి.. లేఖ రాశారు.