బియాస్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు: హైకోర్టు
సిమ్లా/హైదరాబాద్: బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని జలాశయం నిర్వాహకులు, కళాశాల యాజమాన్యం చెరి సగం చొప్పున చెల్లించాలని హైకోర్టు పేర్కొంది.
జులై 9 నాటికి కళాశాల యాజమాన్యం ఈ అంశంపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైదరాబాద్లోని విజ్ఞానజ్యోతి కళాశాలకు చెందిన 24 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు బియాస్ నదిలో లార్జి డ్యాం నుంచి ఆకస్మికంగా నీరు వదలడంతో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. జూన్ 8న ప్రమాదం జరగగా ఇప్పటికి 17 మంది విద్యార్థుల మృతదేహాలు లభించాయి.
మరో ఏడుగురు విద్యార్థుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, మృతుల కుటుంబాలకు ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.