రెడ్జోన్: ఉలిక్కిపడ్డ మంగళగిరి: మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వ్యక్తికి పాజిటివ్: 3కి.మీ పరిధిలో..!
గుంటూరు: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా అదుపు తప్పాయి. మూడు రోజుల్లో నమోదైన పాజిటివ్ కేసులన్నీ దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదులో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనలతో ముడిపడి ఉన్నవే కావడం కలకలం రేపుతోంది. అధికారలుు అంచనా వేసినట్టుగానే.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో స్థానికులు ఈ మత ప్రార్థనలకు హాజరయ్యారు. వారంతా స్వస్థలానికి చేరుకున్నారు.
ఢిల్లీ ప్రార్థనలతో లింక్..
కొత్తగా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో 70 శాతం ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారివేనని అధికారులు వెల్లడిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన 65 సంవత్సరాల వ్యక్తి కరోనా వైరస్ బారిన పడ్డారు. మంగళగిరిలోని టిప్పర్ బజార్కు చెందిన ఆ వ్యక్తి ఢిల్లీలో కిందటి నెలలో మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రార్థనలకు హాజరయ్యారు. కొద్దిరోజుల కిందట స్వస్థలానికి తిరిగి వచ్చారు. తాజాగా- ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్గా తేలింది.
మూడు చదరపు కిలోమీటర్ల పరిధిలో..
దీనితో అధికారులు అప్రమత్తం అయ్యారు. ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు. మంగళగిరి పట్టణాన్ని రెడ్జోన్గా ప్రకటించారు. మూడు చదరపు కిలోమీటర్ల పరిధిని రెడ్జోన్ కిందికి తీసుకొచ్చామని, ఒక్కరు కూడా ఇల్లు దాటి బయట అడుగు పెట్టకూడని విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని గుంటూరు మున్సిపల్ కమిషనర్ హేమామాలిని తెలిపారు. పరిస్థితి కుదుటపడేంత వరకూ రెడ్జోన్ నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
బాధితుడితో పాటు అయిదుమంది కుటుంబ సభ్యులు క్వారంటైన్కు..
టిప్పర్ బజార్కు చెందిన బాధిత వ్యక్తితో పాటు అయిదు మంది ఆయన కుటుంబ సభ్యులను క్వారంటైన్కు తరలించినట్లు చెప్పారు. వారికి వైద్య పరీక్షలను నిర్వహించామని, నివేదికలు అందాల్సి ఉందని అన్నారు. కరోనా పాజిటివ్గా తేలిన ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలను నిర్వహించుకోవాలని హేమామాలిని సూచించారు. ఢిల్లీ నుంచి మంగళగిరికి వచ్చిన తరువాత.. ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవర్ని కలిశారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నామని అన్నారు. ఆ వ్యక్తి ఫోన్ లిస్ట్ ఆధారంగా అతను తిరిగిన ప్రదేశాలు, కలిసిన వ్యక్తుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
Recommended Video
తొలిసారిగా రెడ్జోన్..
రాష్ట్రంలో మిగిలిన పట్టణాలతో పోల్చుకుంటే రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రాంతం.. మంగళగిరి. కరోనా వైరస్ విస్తరించిన ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో తొలిసారిగా రెడ్జోన్గా ప్రకటించిన పట్టణం కూడా ఇదే కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నట్టయింది. తమ పట్టణాన్ని రెడ్జోన్గా ప్రకటించడంతో మంగళగిరివాసులు ఉలిక్కి పడుతున్నారు. మరిన్ని ముందు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. పట్టణంలో పోలీసు బందోబస్తును మరింత కఠినతరం చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. కొత్తగా మరే కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు.