నేనిక్కడే ఉన్నా ... ఆరోపణలపై నోరు విప్పిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ ఎట్టకేలకు స్పందించారు. తాను కనిపించటం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన రైతుల ఫిర్యాదుకు సమాధానం చెప్పారు. నేనెటు వెళ్లాను ... ఎక్కడికీ వెళ్ళలేదు అంటూ సమాధానం చెప్పారు . గత తొమ్మిది రోజులుగా రాజధాని రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నా పట్టించుకోని ఆళ్ళ ఫైనల్ గా నోరు విప్పారు.
వైసీపీ రాజధాని అమరావతికి వ్యతిరేకం కాదన్న ఎమ్మెల్యే..అలా అయితే ఈ రగడ దేనికి అంటున్న తెలుగు తమ్ముళ్ళు
ఆర్కే కనిపించటం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
మంగళగిరి నియోజకవర్గంలో తమ ఓట్లు వేయించుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కడా మాకు కనిపించటంలేదు. తాము ఆందోళనలు చేస్తున్నా తమ దరిదాపులకు కూడా రాలేదు. ఎమ్మెల్యే ఆళ్ల తాము కష్టాల్లో ఉంటే కనీసం పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఆర్కే కనిపించటం లేదంటూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు . మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు.
తాను ఎక్కడికీ వెళ్లలేదని క్లారిటీ ఇచ్చిన ఆళ్ళ .. చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు
ఇక దీనిపై ఎట్టకేలకు స్పందించిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి నేను కనిపించటంలేదు అనే విషయం అవాస్తవం అని చెప్పారు. తాను ఇక్కడే ఉన్నానని ప్రకటించారు. మా కుటుంబంలో ఓ పెళ్లి నేపధ్యంలో ఆ పెళ్లి కార్యక్రమాల హడావిడిలో నాలుగు రోజులు హైదరాబాద్లో ఉన్నానని చెప్పి, తాను కనిపించటంలేదంటూ పోలీస్ స్టేషన్ లో కొంతమంది ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. రాజధాని రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని ఆళ్ల స్పష్టం చేశారు.
చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు
ఇక అంతే కాదు తాను ఎటూ వెళ్లలేదని చెప్తూనే కుప్పంలో చంద్రబాబు కనిపించక 40 సంవత్సరాలు అయిందని కుప్పం నియోజకవర్గం ప్రజలు అంటున్నారు ..ఆ విషయం ఏదో చూడండి అని చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.అయితే ఆళ్ళ తాను ఉన్నాను అని చెప్తే సరిపోదని రాజధాని అమరావతి విషయంలో తన స్టాండ్ ఏంటో చెప్పాలని, సీఎం జగన్ పై ఒత్తిడి తెచ్చి రాజధాని తరలింపు ఆపాలని రాజధాని ప్రాంత రైతులు అంటున్నారు.
రాజధాని వైసీపీ ప్రజాప్రతినిధులకు నిరసన సెగ
ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు ఆందోళన కొనసాగిస్తున్న తరుణంలో రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలకు, ఎంపీలకు నిరసన సెగ తగులుతుంది.ఈ నేపధ్యంలో రాజధాని ప్రాంత రైతులను ఎలా సముదాయించాలి అన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. నేడు మధ్యాహ్నం భేటీ కానున్న వైసీపీ ఎమ్మెల్యేలు రైతులకు మంచి ప్యాకేజ్ ఇచ్చేలా మాట్లాడాలని చూస్తున్నట్టు సమాచారం .