టీడీపీ సోషల్ మీడియా, టీమ్-లోకేష్ నుంచి ప్రాణహాని: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు
అమరావతి: తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం, టీమ్-లోకేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరి నుంచి తనను తరిమి కొడతామని అంటూ టీమ్-లోకేష్ సభ్యులు ఫోన్ చేసి తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని చెప్పారు. దీనిపై ఆయన ఆదివారం తాడేపల్లి పోలీసులకు లిఖిపూరకంగా ఫిర్యాదు చేశారు. టీమ్-లోకేష్ సభ్యుడు నాని చౌదరి అనే వ్యక్తి తనను బెదిరిస్తున్నారని ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపైనా, తమ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా తప్పుడు సమాచారంతో కూడిన పోస్టులు పెడుతున్నారని అన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎలా బతుకుతావో చూస్తామంటూ..
మొన్నటి ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణా రెడ్డి వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పై ఆయన ఆరువేలకు పైగా ఓట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించారు. తమ నాయకుడు నారా లోకేష్ ను ఓడించారనే అక్కసుతో టీమ్ లోకేష్ సభ్యుడు నాని చౌదరి తనను బెదిరిస్తున్నారని అన్నారు. మంగళగిరిలో ఎలా బతుకుతావో చూస్తామని హెచ్చరిస్తున్నారని చెప్పారు. తనను మంగళగిరి నుంచి తరిమికొట్టడంతో పాటు వైఎస్ జగన్ ను జైలుకు పంపిస్తామని ఫోన్ చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
చెన్నై టీడీపీ ఫోరం పేరు ప్రస్తావన
చెన్నై టీడీపీ ఫోరం సభ్యులు కూడా తనపై ఇలాంటి వ్యాఖ్యలనే చేశారని అన్నారు. ఎక్కడో దాక్కుని సోషల్ మీడియాను అడ్డుగా పెట్టుకుని తనపై విషం చిమ్ముతున్నారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలపై తాను ఇదివరకు కూడా అలుపెరుగని పోరాటం చేశానని గుర్తు చేశారు. అప్పట్లో కూడా తనకు బెదిరింపు ఫోన్లు వచ్చాయని అన్నారు. తనను చంపేస్తానంటూ కొంతమంది బెదిరిస్తూ లేఖలు రాశారని, వారిని అరెస్ట్ చేసి జైలుపాలు చేశానని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఆళ్ల రామకృష్ణా రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో మంగళగిరి ప్రజలు లోకేష్ ను దారుణంగా ఓడించినప్పటికీ.. ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. నారా లోకేష్ కు రాజకీయ భవిష్యత్తు అనేదే లేకుండా చేశారని ఎద్దేవా చేశారు.
వరదను అడ్డు పెట్టుకుని బురద రాజకీయాలు
కృష్ణానదికి సంభవించిన వరదల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బురద రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తమ చెప్పు చేతల్లో ఉన్న ఎల్లో మీడియాను అడ్డుగా పెట్టుకోవడంతో పాటు పెయిడ్ వర్కర్లను పెట్టుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను చంద్రబాబు ఇంట్లోకి వెళ్లానంటూ కేసులు పెట్టడం హాస్యాస్పదమని చెప్పారు. చంద్రబాబు ఇంటి వద్ద నిల్చుని, తాను వరద పరిస్థితిని అంచనా వేశానే తప్ప ఆయన ఇంట్లోకి వెళ్లలేదని, అలా చేయడం దరిద్రమని అన్నారు. నరం బెణికిందంటూ కట్టుకథలు చెప్పి, చేతికి కట్టుకుని దొంగ కట్టు కట్టుకుని చంద్రబాబు, నారా లోకేష్ లు హైదరాబాద్ పారిపోయారంటూ ధ్వజమెత్తారు.