జగన్ పక్కన పీకలు కోసే కృష్ణ, మోడీతో ఒప్పందం, చంద్రబాబూ! ఇంకా ఆశ వద్దు: జేసీ
అమరావతి: మహానాడు వేదికపై అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, వైసీపీ అధినేత వైయస్ జగన్ల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. జగన్కు రూ.1500 కోట్లు వస్తున్నాయని చెప్పారు. జగన్లో తాత రాజారెడ్డి క్రూరత్వం ఉందని విమర్శించారు.
చదవండి: జూ.ఎన్టీఆర్.. మోత్కుపల్లి నోట లక్ష్మీపార్వతి మాట: బాబుకు అదే కోపం తెప్పించింది! వెనుక 3 అంశాలు
తనకు టిక్కెట్ ఇస్తానని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని జగన్ తనను కోరారని జేసీ చెప్పారు. పార్టీలోకి వస్తే ఎన్ని డబ్బులు ఇస్తావని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి తనను అడిగారని చెప్పారు. అప్పుడు నేను.. మీకు కప్పం ఎందుకు చెల్లించాలని తాను ఆయనను అడిగానని చెప్పారు. జగన్ దగ్గర ఊడిగం చేయలేక తాను వైసీపీలోకి వెళ్లలేదని చెప్పారు.
చదవండి: అందుకే తెలంగాణ విడిపోయింది, బాబులో రాహుల్ హుషారు: పవన్ దెబ్బకుదెబ్బ, హీరోలకు క్రేజ్ తగ్గుతుందంటే..
నాడు వైయస్సార్ స్కెచ్ వేస్తే, రాజారెడ్డి అమలు చేసేవారు
నాడు స్కెచ్ వైయస్ రాజశేఖర రెడ్డి వేసేవారని, రాజారెడ్డి అమలు చేసేవారని జేసీ చెప్పారు. వైయస్సార్ను మంత్రిని చేసేందుకు రాజారెడ్డి చేయని పని లేదన్నారు. ఎన్నికల సమయంలో జగన్ వద్ద రూ.1000 కోట్ల హార్డ్ క్యాష్ ఉందని చెప్పారు. ఆయన ఎప్పుడు చంపాలి, కొయ్యాలి, నరకాలి అని మాట్లాడుతారన్నారు. వీళ్లు చేసిన పనుల వల్ల రెడ్లపై ప్రజల్లో అసహనం పెరిగిందన్నారు.
జగన్ పక్కన పీకలు కోసే కృష్ణలాంటి వాళ్లు
జగన్ వస్తే ఏపీకి భవిష్యత్తు ఉండదని జేసీ జోస్యం చెప్పారు. చంద్రబాబు పక్కన ఎవరున్నారు, జగన్ పక్కన ఎవరున్నారో ప్రజలు గుర్తించారన్నారు. జగన్ పక్కన పీకలు కోసం మంగళి కృష్ణ లాంటి వారు ఉన్నారని చెప్పారు. చంద్రబాబు మాట వింటారని, జగన్ మాత్రం ఎవరి మాట వినరన్నారు. ప్రజలందా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కోసం కాకుండా మీ కోసం, మీ పిల్ల కోసం టీడీపీకి ఓటు వేయాలన్నారు. ‘జగన్ మాట్లాడితే చంద్రబాబు రెండెకరాల నుంచి లక్షల కోట్ల ఆస్తి సంపాదించారని ఆరోపిస్తున్నారు. పెట్రోల్ బంకులో పనిచేసిన ధీరూబాయి అంబానీ లక్షల కోట్ల ఆస్తి సంపాదించలేదా?. ఆస్తులు సంపాదించుకుంటే తప్పేంటి' అని ప్రశ్నించారు.
చంద్రబాబూ! మీకు ఇంకా ఆశనా, వద్దు, పైకిరండి
చంద్రబాబుకు ఉన్నంత దూరదృష్టి ఎవరికీ లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మాట్లాడితే నేనిక్కడే ఉంటానని అంటారని, ఏమిటి సర్.. నాకు అర్థం కాదు, ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఇక చాలదా మీకు? ఇంకా ఆశ ఉందా? వద్దు.. మీరు ఇంకా పైకి రావాలి.. దేశానికి ప్రధానమంత్రి కావాలి.. మేమంతా సంతోషిస్తామని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరు కుటుంబ పాలన అంటూ మాట్లాడుతున్నారని, టీడీపీని చంద్రబాబే ఈ స్థాయికి తీసుకొచ్చారని, రేపు లోకేశ్ ముఖ్యమంత్రి అయితే ఏమవుతుందని ప్రశ్నించారు. ఆయన సమర్థుడే కదా అన్నారు. 'చంద్రబాబు దయతోనే ఏపీలో బీజేపీకి కొన్ని సీట్లయినా వచ్చాయి. కియా పరిశ్రమ అనంతపురం జిల్లాకు రావడానికి కారణం చంద్రబాబే. మోడీ కియా ప్రతినిధులకు ఐదుసార్లు ఫోన్ చేసి గుజరాత్లో ప్లాంట్ పెట్టాలని ఒత్తిడి చేసినట్లు వారే చెప్పారు. దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాను చంద్రబాబు సస్యశ్యామలం చేస్తున్నారు. కోనసీమను తలపించేలా తీర్చిదిద్దుతున్నార'ని జేసీ అన్నారు.
నా ఆస్తిని కొడుక్కి ఇచ్చినట్లే, లోకేష్కు టీడీపీని ఇవ్వొచ్చు
నేను సంపాదించిన ఆస్తి నా కొడుకుకి ఇవ్వనా.. ఇక్కడ ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నాడు.. ఆయన సంపాదించిన ఆస్తి తన కొడుకుకి ఇవ్వడా.. టీడీపీ అనేది చంద్రబాబు సొంతం.. అని జేసీ అన్నారు. దానిని చంద్రబాబు తన కొడుకుకి ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రధానమంత్రి ఎందుకు కాకూడదన్నారు.
హోదా రాదని మూడేళ్ల క్రితమే చెప్పా
నరేంద్ర మోడీ ఉన్నంత వరకు ఏపీకి ప్రత్యేక హోదా రాదని తాను మూడేళ్ల క్రితమే చెప్పానని జేసీ అన్నారు. జగన్కు అన్నీ వాళ్ల తాత బుద్ధులే వచ్చాయన్నారు. ఆయన ఎప్పుడూ ఎవరినో ఒకరిని విమర్శిస్తూ ఉంటారన్నారు. చంద్రబాబును విమర్శించడమే పనిగా జగన్ పెట్టుకున్నారన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ భూ స్థాపితం అయిందని అన్నారు. జన్మభూమి కమిటీలతో కమిటీలతో ఎలాంటి లాభం లేదని, వాటిని ఎత్తివేయాలని చంద్రబాబుకు జేసీ సూచించారు. టెలికాన్ఫరెన్సులు వద్దని, అధికారులకే కాస్త గట్టిగా చెప్పాలన్నారు. చంద్రబాబు మూలవిరాట్టు అని జేసీ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రమణ దీక్షితుల్లా తయారయ్యారన్నారు. వాస్తవాలు చంద్రబాబుకు చేరడం లేదన్నారు. తప్పు చేసిన వారిని దండించాలన్నారు. నేను మిమ్మల్ని విమర్శిస్తున్నానని అనుకోవద్దని, తనకు ఎలాంటి దుర్బుద్ది లేదన్నారు.