రామ్ మాధవ్ చక్రం, బీజేపీ అధ్యక్షుడిగా మాణిక్యాల రావు? సోము వీర్రాజు, కన్నాలకు బుజ్జగింపు!
అమరావతి: ఏపీ బీజేపీలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు హరిబాబు స్థానంలో కొత్త వారు రాబోతున్నారు. ఆయన స్థానంలో మాజీ మంత్రి మాణిక్యాల రావుకు అవకాశం దక్కనుందని తెలుస్తోంది.
రెచ్చగొడుతావా, టీడీపీని మరిచేవారు, సినిమాల్లేని హీరోతో: బాబుకు జీవీఎల్ దిమ్మతిరిగే షాక్
హరిబాబు స్వభావం మెతగ్గా ఉంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో అది సరికాదని బీజేపీ అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. టీడీపీ నేతలు విరుచుకుపడుతున్న సమయంలో రాష్ట్ర అధ్యక్షులు దూకుడుగా ఉండాలని భావిస్తున్నారు.
తెరపైకి మాణిక్యాల రావు పేరు
ఈ నేపథ్యంలో మాణిక్యాల రావు పేరు తెరపైకి వస్తోందని అంటున్నారు. మాణిక్యాలరావుతో పాటు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ తదితరుల పేర్లను పరిశీలించింది. వీరు ముగ్గురు కాపు సామాజికవర్గానికి చెందినవారు. చివరికి వీరిలో మాణిక్యాలరావు వైపు మొగ్గు చూపారని సమాచారం.
రామ్ మాధవ్ చక్రం తిప్పారా?
దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. మాణిక్యాల రావు నియామకంలో ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ రామ్ మాధవ్ హస్తం ఉన్నట్లుగా భావిస్తున్నారు. సోము వీర్రాజు వైపు తొలుత మొగ్గు చూపినప్పటికీ ఆయన కొన్ని సందర్భాల్లో నోరు జారే అవకాశముందని రామ్ మాధవ్ భావించారట.
ఈ రెండు లక్షణాలున్న వ్యక్తి
అధ్యక్ష పదవిలో ఉన్నవారికి దూకుడుతో పాటు కొన్ని సమయాల్లో సంయమనం కూడా అవసరమని రామ్ మాధవ్ భావిస్తున్నారని తెలుస్తోంది. దూకుడు, సంయమనం కలగలిసిన వ్యక్తి మాణిక్యాల రావు అని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.
సోము వీర్రాజు, కన్నాలకు బుజ్జగింపు
మరోవైపు అధ్యక్ష పదవిని ఆశించిన సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలను బుజ్జగించేందుకు వారిని జాతీయ కమిటీలోకి తీసుకునే అవకాశముందనే ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో రాష్ట్ర కార్యవర్గంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల మాణిక్యాల రావు.. రామ్ మాధవ్ను కలిశారు.