సంచలనం:"ఆపరేషన్ ద్రవిడ"శివాజీపై...డిజిపికి బిజెపి నేతల ఫిర్యాదు
అమరావతి:ఆపరేషన్ ద్రవిడ పేరుతో నిరాధారమైన ఆరోపణలు చేసిన సినీనటుడు శివాజీపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బిజెపి మాజీ మంత్రి మాణిక్యాలరావు సారధ్యంలో బిజెపి నేతలు డిజీపి మాలకొండయ్యని కలిసి ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ ద్రవిడ అంటూ శివాజీ రిలీజ్ చేసిన వీడియోపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ మాలకొండయ్యకు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చారు.
కేంద్రంపై ఎపి ప్రభుత్వం పోరాటం నేపథ్యంలో సినీ నటుడు శివాజీ ఆపరేషన్ ద్రవిడ అంటూ మీడియా ఎదుట సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను వాడుకొనేందుకు ఓ జాతీయ పార్టీ ఆపరేషన్ మొదలుపెట్టిందని వ్యాఖ్యలు చేశారు. 'ఆపరేషన్ ద్రవిడ' పేరిట ఈ ఆపరేషన్ చేస్తోందని, 2019 నాటికి ఏపీపై అధిపత్యం దక్కించుకోవడం కోసం పెద్ద కుట్ర జరుగుతోందని, ఏడాదిగా ఈ ఆపరేషన్ జరుగుతోందన్నారు.
దీనికోసం మొత్తం రూ. 4, 800 కోట్లు కేటాయించారని ఆరోపించారు. బీజేపీ అనుబంధ సంఘానికి చెందిన కర్నాటకకు చెదిన కళ్యాణ్ జీ అనే వ్యక్తి ద్వారా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు.ఈ ఆపరేషన్ ద్రవిడలో మూడు సబ్ ఆపరేషన్లు ఉన్నాయని, తమిళనాడు, కర్ణాటకకు ఆపరేషన్ సుకుమార... తమిళనాడు, కేరళకు సంబంధించి ఆపరేషన్ రావణ చేస్తున్నారన్నారు. ఆపరేషన్ కు సంబంధించిన అన్ని వివారాలు పెన్ డ్రైవ్ లో వున్నాయని శివాజీ పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శివాజీ ఆపరేషన్ ద్రవిడ పేరుతో బిజెపిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని...విష ప్రచారం చేస్తున్నారని భాజపా నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బిజెపి నేతలు ఏకంగా డిజిపిని కలసి శివాజీపై ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.