ఇక తప్పుకో!: కనుమూరి బాపిరాజుకు షాక్, హెచ్చరిక
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి నుంచి ఇక తప్పుకుంటే మేలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు మంగళవారం కనుమూరి బాపిరాజుకు సూచించారు. పదవి నుంచి తప్పుకోకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తగిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.
యూపీఏ హయాంలో నామినేటెడ్ పదవులు పొందిన వారు ఇంకా పదవులు పట్టుకు వేళ్ళాడడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు. మాణిక్యాల రావు మంత్రి ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
కనుమూరి బాపిరాజు నేతృత్వంలోని ధర్మకర్తల మండలి బాధ్యతల నుంచి వైదొలగాలని స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసిన మంత్రి మాణిక్యాల రావుకు ఆలయ ఈవో గోపాల్, జేఈవో శ్రీనివాస రాజు ఘనంగా స్వాగతం పలికారు.
ఎంసీఐ నుంచి రాష్ట్రానికి 400 సీట్లు కేటాయింపు: మంత్రి కామినేని
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నుంచి రాష్ట్రానికి 400 సీట్లు కేటాయించారని ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. నెల్లూరుకు 150, తిరుపతికి 50, కాకినాడకు 50 సీట్ల చొప్పున కేటాయించారని ఆయన తెలిపారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి 150 సీట్లను ఎంసీఐ కేటాయించిందని ఆయన చెప్పారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి మెడికల్ కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉందని మంత్రి అన్నారు.