పవన్ వల్లే మాకు మంత్రి పదవులు, చిరంజీవి అందుకే ఓడారు: మంత్రి మాణిక్యాల రావు
విశాఖపట్నం: జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు పవన్కల్యాణ్ చొరవతోనే తమకు మంత్రి పదవులు వచ్చాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు స్పష్టం చేశారు. అనకాపల్లిలోని సత్యనారాయణమూర్తి దేవస్థానం వద్ద ఆదివారం జరిగిన ఓ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ విజయానికి పవన్కల్యాణ్ ఎంతో తోడ్పాటు అందజేశారని పేర్కొన్నారు. ఏ జాతిలో క్రమశిక్షణ తక్కువగా ఉందంటే అది కాపుజాతిలో మాత్రమేనని, కాపులైన రంగా హత్యను సాకుగా చూపి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని అన్నారు.
అంతేగాక, పాలకొల్లులో చిరంజీవి ఓటమికి కాపు కులస్తుల్లో క్రమశిక్షణ లేకపోవడమే కారణమని అన్నారు. రాజస్థాన్లో మెనా అనే కులస్తులు ఉన్నారని, వారిని బిసిల్లో చేర్చుకోవాలని 90 రోజులు రైల్వేలైన్లు, జాతీయ రహదారిని దిగ్బంధించారని ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు గుర్తు చేశారు.
ఈ ఘటనలతో ప్రభుత్వం దిగివచ్చిందని, ఉద్యమం చేస్తే అలా ఉండాలని చెప్పారు. అయితే, కాపుకులం కూడా రాష్ట్రంలో బలమైన శక్తి అని చిరంజీవి నిరూపించారని పేర్కొన్నారు. కాపులను బిసిలో చేర్చే ప్రయత్నం చేస్తున్నామని, ఇది సాధ్యమవుతుందన్న ఆశాభావాన్ని మంత్రి మాణిక్యాల రావు వ్యక్తం చేశారు.