‘బాబూ! ప్రధానికి మొక్కినట్లే.. కాపులంతా పవన్ వైపే! కర్ణాటకకు టీడీపీ టీంలు’
అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ నేతలు పైడికొండల మాణిక్యాల రావు, విష్ణుకుమార్ రాజులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని మాణిక్యాల రావు అన్నారు.
అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాణిక్యాల రావు మాట్లాడుతూ.. అన్ని పరిస్థితులు అన్ని వేళలా ఒకేలా ఉండవని అన్నారు. తాను సభలో మాట్లాడటం కోసం ప్రయత్నిస్తున్నా.. తనను పట్టించుకోవడం లేదని అన్నారు.
పవన్ వ్యాఖ్యలు.. టీడీపీని నమ్మడం లేదు
సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో తాము గ్రామాల్లోకి వెళ్లలేకపోయేవాళ్లం.. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదని మాణిక్యాల రావు వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత టీడీపీ చేస్తోన్న వాదనను ప్రజలు నమ్మడం లేదని అన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటకకు టీడీపీ టీంలు
రాష్ట్రంలో అవినీతి జరుగుతోంది కాబట్టే.. కేంద్రం నిధులు కట్ చేసి ఉంటుందనే భావనలో ప్రజలు ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కన్పిస్తోందని ఎద్దేవా చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని పైడికొండల మాణిక్యాల రావు అన్నారు. అయితే, బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ కొన్ని బృందాలను కర్ణాటకకు పంపిందని ఆయన ఆరోపించారు.
కాపులంతా పవన్ వైపే..
ఏపీలో 80శాతం మంది కాపులు పవన్ వైపే ఉన్నారని, పవన్ వారిని ఎలా వినియోగించుకుంటారో చూడాలని మాణిక్యాల రావు అన్నారు. టీడీపీ అవినీతిపై పవన్ మాట్లాడిన తర్వాతే ఆ విషయం జనంలోకి బాగా వెళ్లిందని అన్నారు. అయితే, కొన్నిరోజులుగా బీజేపీపై టీడీపీ చేస్తోన్న వాదనలు ప్రజల్లోకి వెళ్లడం లేదని అన్నారు.
బాబూ.. ప్రధానికి మొక్కినట్లే..
మరో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. పార్లమెంటు మెట్లకు మొక్కి వెళ్లడమంటే.. పార్లమెంటులో అత్యున్నత స్థానంలో కూర్చున్న ప్రధానమంత్రికి మొక్కినట్లేనని అన్నారు. చంద్రబాబు మంగళవారం పార్లమెంటు మెట్లకు మొక్కిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈశాన్య రాష్ట్రాలతో పోల్చొద్దు
రాఫెల్ డీల్ వంటి విషయాల గురించి మాట్లాడేంత పెద్ద వాళ్లం కాదని, స్యాండ్, ల్యాండ్ గురించి మాట్లాడుతామని అన్నారు. నల్లధనం ఉన్నవారికే నోట్ల రద్దు ఇబ్బందులను కలిగించిందని విష్ణు కుమార్ రాజు అన్నారు. ఏపీని ఈశాన్య రాష్ట్రాలతో పోల్చడం సరికాదని అన్నారు. యూటర్న్ తీసుకున్న టీడీపీ.. అందరితోనూ అదే మాట్లాడిస్తోందని అన్నారు.