దిగ్భ్రాంతికి గురయ్యా , అడిగి నానా మాటలు పడ్డా : మనీషా కొయిరాలా
జాతీయ మహిళా పార్లమెంటు ప్రారంభోత్సవ సభలో ‘వివక్ష-అసమానతలు’ అనే అంశంపై ప్రసంగించిన మనీషా.. పవర్ పాయింట్ స్లయిడ్ లను ఉపయోగిస్తూ.. బాలీవుడ్ లోని అసమానతల పార్శ్వాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.
అమరావతి: ''బాలీవుడ్ సినిమాల్లో నటీనటులకు చెల్లించే పారితోషికాల్లో భారీ అంతరం ఉంది. ఇదేమిటని ఓ నిర్మాతను నేను అడిగాను. నటుల కారణంగానే సినిమా చూస్తారని, నటీమణులను చూసి రారని ఆయన జవాబిచ్చారు...'' ఇది నటి మనీషా కొయిరాలా ఆవేదన.
అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంటు ప్రారంభోత్సవ సభలో 'వివక్ష-అసమానతలు' అనే అంశంపై ప్రసంగించిన మనీషా.. పవర్ పాయింట్ స్లయిడ్ లను ఉపయోగిస్తూ.. బాలీవుడ్ లోని అసమానతల పార్శ్వాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.
దిగ్భ్రాంతికి గురయ్యా...
నటించేందుకు తమకు, హీరోలకు ఇచ్చే పారితోషికంలో ఇంత అంతరం ఉంటుందని మొదట తనకు తెలియదని, తెలిశాక దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె చెప్పారు. అంతేకాదు, ఈ అంతరంపై ప్రశ్నించినందుకు కూడా తాను నానా మాటలు పడాల్సి వచ్చిందని వాపోయారు.
ఇంటా, బయటా ఇదే...
ఇలాంటి వివక్ష బాలీవుడ్ కే పరిమితం కాదని, బయట కూడా మహిళలు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారని, కష్టపడి చదివి ఎదిగినా.. చెల్లింపులు దగ్గరకు వచ్చేసరికి పురుషులకు 25 శాతం అదనంగా వేతనాలు ఉంటున్నాయని మనీషా బాధను వ్యక్తం చేశారు.
పుట్టుకతోనే మొదలు...
పుట్టుక నుంచీ మహిళలపై వివక్ష కొనసాగుతున్నదని చెబుతూ.. తన స్వీయ అనుభవాన్ని మహిళా ప్రతినిధులతో ఆమె పంచుకున్నారు. ‘‘నేను పుట్టినప్పడు అక్కడే ఉన్న మా నాన్న ముఖకవళికలు మారిపోయాయట. అది చూసి మా అమ్మ ఎంతో బాధపడిందట. పెద్దయ్యాక ఈ విషయాలు తెలిసి నేనూ కుంగిపోయాను..' అని మనీషా కొయిరాలా వ్యాఖ్యానించారు.
నేటికీ బాల్య వివాహాలు..
అయితే ఈ వివక్ష తన విషయంలో మాత్రమే జరగలేదని, మొత్తం సమాజం పోకడంతా ఇలాగే ఉందని ఆమె వివరించారు. లింగ నిర్ధారణ పరీక్షలను తప్పుబట్టిన మనీషా.. నేటికీ బాల్య వివాహాలు జరుగుతున్నాయంటూ వాపోయారు.