నేనేం చేయలేదు, నిర్ణయాలన్నీ ఆయనవే: సిబిఐ కోర్టుకు దాసరి
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, తెలుగు సినీ దర్శకనిర్మాత దాసరి నారాయణ రావు మంగళవారంనాడు ఢిల్లీలోని సిబిఐ కోర్టులో హాజరయ్యారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం కేసులో ఆయన కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కుంభకోణంలో తన ప్రమేయం లేదని దాసరి చెప్పారు.
తాను కేవలం సహాయ మంత్రిగా మాత్రమే ఉన్నానని, అప్పటి నిర్ణయాలన్నీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగే తీసుకున్నారని ఆయన చెప్పారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ బొగ్గు మంత్రిత్వ శాఖ ఇంచార్జీగా ఉన్నారని, అందువల్ల ఆయనే నిర్ణయాలు తీసుకున్నారని దాసరి చెప్పారు
విషయం కోర్టులో ఉందని, అందువల్ల తాను ఏమీ మాట్లాడలేనని, బ్లాక్లను కేటాయించే అధికారమంతా బొగ్గు శాఖ మంత్రికే ఉందని ఆయన చెప్పారు. అప్పటి బొగ్గు మంత్రిగా ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ వ్యవహరించారని ఆయన అన్నారు.
జార్ఖండ్లోని అమరుకొండ ముర్గా దుంగల్ బొగ్గు క్షేత్రాల కేటాయింపు కేసులో దాసరితో పాటు మొత్తం 14 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గుప్తాల్పై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. దాసరి నారాయణరావుతో పాటు 14 మందికి కూడా సిబిఐ ప్రత్యేక కోర్టు ఇది వరకే బెయిల్ మంజూరు చేసింది.