సాయిరెడ్డికి అశోక్ ఘాటు కౌంటర్- జ్ఞానం పెంచుకో- దాడుల సంస్కృతి మానుకో..
మాన్సాస్ ట్రస్టు, సింహాచలం ఆలయ బోర్డులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ రాజకీయాల్లో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. ముఖ్యంగా మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్గా హైకోర్టు తీర్పుతో తిరిగి నియమితులైన అశోక్ గజపతిరాజును లక్ష్యంగా చేసుకుని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న విమర్శలకు ఆయన ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు.
మాన్సాస్ ఛైర్మన్గా తిరిగి బాధ్యతలు చేపట్టిన తనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేస్తున్న విమర్శలపై అశోక్ గజపతిరాజు స్పందించారు. విజయసాయి జ్ఞానం పెంచుకోవాలని అశోక్ సూచించారు. ఇవాళ నెల్లిమర్లలో ఆలయాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన అశోక్.. సాయిరెడ్డిని హత్య చేసేందుకు సిద్ధపడ్డానని తనపై చేసిన ఆరోపణల్ని గుర్తు చేశారు. హిందూమతంపై దాడుల్ని నిరోధించాలని సాయిరెడ్డికి సూచించారు.
Recommended Video
రామతీర్ధంలో రాముడి తల నరికిన విధ్వంసకుల్ని పట్టుకున్న దాఖలాలు ఇప్పటికీ లేవని అశోక్ గజపతి రాజు ఆరోపించారు. న్యాయాన్ని, ధర్మాన్నీ కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. రాముడి విగ్రహం శిరస్సు తొలగించిన వారిని ఇప్పటికీ ఎందుకు పట్టుకోలేకపోయారని విజయసాయిరెడ్డిని అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు. చీకటి జీవోలతో తనను తొలగించిన ప్రభుత్వానిదే తప్పన్నారు. వాటిని అమలు చేసిన అధికారులదీ, సిబ్బందిదీ తప్పుకాదన్నారు. ఇప్పటికైనా దాడుల సంస్కృతిని ప్రభుత్వం మానుకోవాలని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు.