మాన్సాస్ ట్రస్ట్ వివాదం: సంచయిత ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా నియామకంపై నిర్మాత సంచలన ట్వీట్
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి.ఇక ఇటీవల సంచయితను ట్రస్ట్ చైర్మన్ గా నియమించటంపై రాజకీయ రగడ రగులుకుంది. అన్య మతస్థులకు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా అవకాశం ఇవ్వటం సమంజసం కాదని అశోక్ గజపతి రాజు విమర్శలు గుప్పించారు. ఇక సంచయిత తాను హిందువునని చెప్పింది. ఇక తాజాగా సినీ ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ సంచయిత నియామకం గురించి సంచలన ట్వీట్ చేశారు.
హిందూ దేవాలయానికి క్రిస్టియన్ చైర్మన్ అంటూ వివాదం
తనకు ట్రస్ట్ చైర్మన్ గా ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని తాను హిందువునని, నా మతం గురించి మాట్లాడితే బాధేస్తోందని సంచయిత చెప్పారు. వాటికన్ సిటీ వెళ్లి ఫోటో దిగితే నేను క్రిష్టియన్ అవుతానా? అని సంచయిత అంటున్నారు. ఇక మరోవైపు సంచయిత క్రిస్టియన్ అనే అంశంపై రాద్దాంతం కొనసాగుతున్న సమయంలో హిందూ దేవాలయానికి క్రిస్టియన్ని ఛైర్మన్గా ఎలా నియమిస్తారని కొందరు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వివాదానికి కారణం లేకపోలేదు .
సంచయిత చర్చి ఫోటో ట్వీట్ చేసి ఆవేదన వ్యక్తం చేసిన ప్రొడ్యూసర్
ఆనంద గజపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయిత . ప్రస్తుతం సంచయిత తల్లికి రెండో భర్త అయిన వ్యక్తి క్రిస్టియన్ కావటంతోనే ఈ విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మరోవైపు ఇదే అంశంపై ప్రముఖ తెలుగు ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ సైతం సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. సంచయిత 2017లో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఏసు క్రీస్తు బొమ్మతో ఉన్న ట్వీట్ను పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని, ఎవరికి చెప్పుకోవాలి అంటూ తన ఆవేదన ట్వీట్లో పేర్కొన్నారు . ఈ ట్వీట్కు పవన్ కళ్యాణ్ ఖాతాతో పాటు ప్రధాన మంత్రి ఆఫీస్ అకౌంట్ను ట్యాగ్ చేశారు మధుర శ్రీధర్ .
మత ప్రాతిపదికన రాజకీయ దుమారం
మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనంద గజపతిరాజు కుమార్తె అయిన సంచయిత బిజేపీ యువమోర్చాలో జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు. సడన్ గా ఈమెకు వైసీపీ సర్కార్ మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్, సింహాచలం దేవస్థానం బోర్డు ఛైర్మన్ పదవులను కట్టబెట్టింది. దీనికి సంబంధించి వివరణ కోరుతూ బీజేపీ ఇప్పటికే ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఈ వ్యవహారం కాస్తా మత ప్రాతిపదికన రచ్చగా మారుతుంది.