ఊర్మిళ యువరాణి అనుకుంటున్నారా?: సంచయిత మాన్సాస్ ట్రస్ట్ లేఖ, వివాదం కొనసాగింపు
విజయనగరం: గజపతి రాజుల కుటుంబాల మధ్య వివాదాలు రచ్చకెక్కుతున్నాయి. నిన్నమొన్నటివరకు పరస్పరం విమర్శలు చేసుకోగా.. తాజాగా వారికుటుంబాల మధ్య ఉన్న వైరం బహిర్గతమైంది. ఇందుకు సిరిమానోత్సవం వేదికగా మారింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలకు సంబంధించి మాన్సాస్ ట్రస్ట్ తాజాగా, ఓ లేఖను విడుదల చేసింది.
అదే ఆనవాయితీ.. మాన్సాస్ ట్రస్ట్ లేఖ..
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న వ్యవహారంపై మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ కార్యాలయం విడుదల చేసిన లేఖ ఇప్పుడు మరో చర్చకు దారితీసింది. సిరిమానోత్సవంలో మాన్సాస్ ట్రస్ట్ చైర్సన్కు ముందు వరుసలో సీటు కేటాయించడం ఆనవాయితీ అని స్పష్టం చేసింది.
మహారాణి, రాజ కుమార్తె అనుకుంటున్నారు..
కొంతమంది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా వచ్చి ముందు వరుసలో కూర్చున్నారని వెల్లడించింది. పూసాటి ఆనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిళ, ఆమె తల్లి సుధా గజపతి రాజు.. ఈవో పక్కన కూర్చుని సిరిమానోత్సవాన్ని వీక్షించారని తెలిపింది. అయినా తమకు సీట్లు కేటాయించలేదని మీడియాకు చెప్పడం బాధాకరమని మాన్సాస్ కార్యాలయం విడుదల చేసిన లేఖలో పేర్కొంది.
వారిని మహారాణి, రాజ కుమార్తెలాగా చూడాలని కోరుకుంటున్నారని, కానీ, సిరిమానోత్సవం ప్రజల పండగల అని తెలిపింది.
ఇంకా రాజరికం కోరుకోవడమా?
ప్రజాస్వామ్యంలో ఇంకా కొంతమంది రాజరికం కోరుకోవడం దురదృష్టకరమని ఊర్మిళ, సుధాలనుద్దేశించి మాన్సాస్ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఊర్మిళ, ఊర్మిళ తల్లి ప్రవర్తించిన తీరు అహంకారపూరితంగా ఉందని ఆరోపిచింది. కాగా, దసరా పర్వదినం సందర్భంగా మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా జరిగింది. అయితే, ఈ వేడుకలో పూసపాటి కుటుంబసభ్యుల తీరు చర్చనీయాంశంగా మారింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ కోసం ముందు వరుసలో ఏర్పాటు చేసిన కుర్చీలో ఊర్మిళ, ఆమె తల్లి సుధ కూర్చోవడంపై ట్రస్ బోర్డు ఛైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ట్రస్ట్ కార్యాలయం లేఖ విడుదల చేయడం గమనార్హం.
అంతా సంచయిత వల్లే..
ఇది ఇలావుంటే, తమ ఇంటి ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఏటా కోట బురుజుపై నుంచి తిలకిస్తామని పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిళ గజపతి రాజు తెలిపారు. తమను ఎవరు అనుమతించారని చైర్ పర్సన్ సిబ్బందిపై ఆగ్రహించడం సరికాదన్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమించినా ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం చేయించలేదని ఊర్మిళ తెలిపారు. కోట బురుజుపై జరిగిన ఘటనలో ప్రభుత్వ జోక్యం లేదని, సంచయిత వ్యక్తిగత ప్రమేయంతోనే జరిగిందని ఊర్మిళ తెలిపారు. సంచయిత అహంకాపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు