కాంగ్రెస్కు షాక్, 11వ తేదీన జగన్ పార్టీలోకి మాజీ మంత్రి: సాయిరెడ్డితో కలిసి
అమరావతి/ప్రకాశం: మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు మహీధర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 2004, 2009లలో ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. శనివారం వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమణ కరుణాకర్ రెడ్డిలతో భేటీ అయ్యారు.
చదవండి: చిరంజీవి తర్వాత జగన్ సాహసం!: న్యూజిలాండ్లో బంగీ జంప్ (వీడియో)
అనంతరం మహీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ నెల 11న వైసీపీ అధినేత వైయస్ జగన్ పాదయాత్రలో పాల్గొని, ఆయన సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తిరుపతి ప్రెస్క్లబ్లో విజయసాయి రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి మాట్లాడారు.
తన ఇష్టదైవం సాయినాథుని సన్నిధిలో నిర్ణయం తీసుకున్నానని, పని చేస్తున్న చేయికి మా చేతులు జోడించాలని భావించానని, ప్రజలకు మేలు చేసే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని, నియోజకవర్గ ప్రజల కోసం, వారి అభీష్టం మేరకు వైసీపీలో చేరుతున్నానని ప్రకటించారు.
మహీధర్ రెడ్డి చాలాకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన వైసీపీలో చేరుతారని చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. చాలాకాలంగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయన ఇప్పుడు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కాగా, చాలాకాలంగా చర్చలు జరిగాయని తెలుస్తోంది. విజయసాయి రెడ్డి తదితరులు ఆయనను పార్టీలోకి తీసుకు రావడంలో సఫలమయ్యారని తెలుస్తోంది.
వైసీపీలోకి విశాఖ బీజేపీ నేత
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చొక్కాకుల వెంకట్రావు శనివారం పార్టీకి రాజీనామా చేశారు. ఫ్యాక్స్ ద్వారా అధిష్ఠానానికి తెలియజేసినట్లు చెప్పారు. గతంలో వైసీపీ తరపున విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేశానన్నారు. మళ్లీ అదే పార్టీలో సోమవారం జగన్ సమక్షంలో చేరుతున్నట్లు తెలిపారు. తనతో పాటు మరికొందరు చేరుతారన్నారు. బీజేపీలో తనకు సహకరించిన ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.