అఖిలప్రియ.. చిన్న వయస్సులో ఎన్నో పెద్ద సవాళ్లు, ఆయనదే బాధ్యత!
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అఖిల ప్రియ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఆమె చిన్న వయస్సులోనే మంత్రి అయ్యారు. రాజకీయాల్లోకి వచ్చిన మూడేళ్లలోనే ఆ పదవి దక్కింది. ప్రస్తుతం ఉన్న కేబినెట్లో అతిపిన్న వయస్కురాలు
కర్నూలు: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అఖిల ప్రియ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఆమె చిన్న వయస్సులోనే మంత్రి అయ్యారు. రాజకీయాల్లోకి వచ్చిన మూడేళ్లలోనే ఆ పదవి దక్కింది. ప్రస్తుతం ఉన్న కేబినెట్లో అతిపిన్న వయస్కురాలు అఖిలప్రియనే. ఇప్పుడు ఆమె ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి.
అఖిల ప్రియ ఎమ్మెల్యేగా ఎన్నికైననప్పటికీ.. తండ్రి భూమా నాగిరెడ్డి అంతా చూసుకునేవారు. ఆయన అడుగుజాడల్లో నడిచేవారు. కూతురుకు రాజకీయం నేర్పేందుకు భూమా ఆసక్తి చూపారు.
ఆళ్లగడ్డ నుంచి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు.. ఎవరు తనవద్దకు వచ్చినా మీ ఎమ్మెల్యే అఖిలప్రియ అక్కడే ఉన్నారు... ఆమెతో మాట్లాడండి అని పంపించేవారని అంటుంటారు. భవిష్యత్తును ఊహించి భూమా అలా చేసి ఉంటారు.

అఖిలప్రియ ముందు సవాళ్లు
ప్రస్తుతం మంత్రిగా అఖిలప్రియ బాధ్యతలు చేపట్టడంతో అటు నంద్యాల, ఇటు ఆళ్లగడ్డ అభివృద్ధి బాధ్యతలను ఆమె మోయాల్సి ఉంటుంది. మూడేళ్ల క్రితం తల్లి శోభ మృతితో అఖిల ప్రియ ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు భూమా మృతితో.. రెండు నియోజకవర్గాల బాధ్యత అఖిలపైన పడింది. నంద్యాల పట్టణంలో రహదారుల విస్తరణ, పేదలకు పది వేల పక్కాగృహాల నిర్మాణం, వెలుగోడు రిజర్వాయర్ నుంచి నంద్యాలకు తాగునీటి పైప్లైన్ ఏర్పాటుకు సంబంధించి భూమా నాగిరెడ్డి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

పిన్న వయస్సులో క్లిష్ట బాధ్యతలు
ఇప్పుడు తన తండ్రి లేని లోటును పూడ్చడంతోపాటు ఆయన వదిలివెళ్లిన బాధ్యతలను అఖిల.. స్వీకరించి హామీలను నెరవేర్చాల్సి ఉంది. మరోవైపు తన సొంత నియోజకవర్గం ఆళ్లగడ్డను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఆమెకు సవాల్ లాంటివే. పిన్న వయసులో క్లిష్ట బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తారోనని చర్చ జరుగుతోంది.

గ్రూపులు అఖిలప్రియకు కత్తిమీద సాము
ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలలో పార్టీలో బలమైన రాజకీయ గ్రూపులు ఉన్నాయి. నంద్యాలలో మొదటి నుంచి భూమా, శిల్పా వర్గాల మధ్య రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోంది. భూమాకు మంత్రి పదవి ఇవ్వరాదని మొదటి నుంచి శిల్పా సోదరులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి చేశారు. చివరి క్షణంలో ఇంచార్జి మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భూమా, శిల్పాల మధ్య రాజీ కుదిర్చారు.
శిల్పా చక్రపాణి రెడ్డి కుమారుడి వివాహానికి పాతికేళ్ల రాజకీయ వైర్యాన్ని పక్కన పెట్టి భూమా నాగిరెడ్డి హాజరయ్యారు. నేతలు కలిసినా దిగువస్థాయి కార్యకర్తల్లో వర్గ విబేధాలు తగ్గలేదని అంటున్నారు. ఆళ్లగడ్డలోను ఒకే పార్టీలో భూమా, ఇరిగెల రాంపుల్లారెడ్డి వర్గాలు కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా ఈ రెండు వర్గాల మధ్య ఫ్యాక్షన్, రాజకీయ వైరం ఉంది. ఒకే పార్టీలో ఉన్నా ఈ రెండు వర్గాల కలవడం లేదు. మంత్రిగా బాధ్యలు చేపట్టిన అఖిలకు వర్గాల సమన్వయం కత్తిమీద సాములాంటిదే.

మేనమామదే బాధ్యత
రాజకీయంగా కేవలం మూడేళ్ల అనుభం ఉన్న అఖిల ప్రియ దశాబ్దాల రాజకీయ అనుభవాలు కలిగిన సీనియర్ నాయకులను సమన్వయం చేయాల్సి ఉంది. గ్రామస్థాయి వరకూ అందరినీ కలుపుకుని వెళ్లేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో రాజకీయ, ప్రభుత్వ పాలన పరంగా సలహాలు, సూచనలు ఇచ్చే బాధ్యత మేనమామ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తీసుకోనున్నారు. అఖిల ప్రియ రాజకీయ భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో ఎస్వీ పాత్ర ఎంతో కీలకమని అంటున్నారు. వారి బాధ్యత తనది అని ఎస్వీ మోహన్ రెడ్డి కూడా చెప్పారు.












Click it and Unblock the Notifications