అనంత లాకప్డెత్: తెలియదన్న డీజీపీ, బస్టాండ్లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య
అమరావతి: అనంతపురం జిల్లాలోని సీకే పల్లిలోని పోలీస్ స్టేషన్లో జరిగిన లాకప్ డెత్ గురించి తనకు తెలియదని ఏపీ డీజీపీ జేవీ రాముడు అన్నారు. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి డీజీపీ రాముడు, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు హాజరయ్యారు.
జిల్లాలోని సీకే పల్లిలో బత్తెన శ్రీరాములు (54) పోలీసుల అదుపులో శుక్రవారం చనిపోయిన సంగతి తెలిసిందే. మండలంలోని ముష్టికోవెల పంచాయతీ గువ్వలగొందిపల్లెకు చెందిన శ్రీరాములును గుప్త నిధుల తవ్వకాల కేసు విచారణలో భాగంగా పోలీసులు నాలుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు.
ఆ క్రమంలో శ్రీరాములు శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై పోలీస్ స్టేషన్లోనే చనిపోయాడు. దీనిపై ఈరోజు మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు జేవీ రాముడు పైవిధంగా స్పందించారు. అనంతరం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా తన చిన్ననాటి స్నేహితులందరినీ పలకరించారు.
అంతక ముందు శనివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చెన్నకేశవ స్వామిని దర్శించుకున్నారు. జిల్లాలోని బత్తలపల్లి మండలం డి. చెర్లోపల్లి గ్రామ సమీపంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెన్నకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ఆవరణలో 'నీరు-చెట్టు' కార్కక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉద్యమస్ఫూర్తిలో మొక్కలు నాటాలని ఏపీ సిఎస్ కృష్ణారావు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి, డీజీపీ రాముడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వర్సిటీ ఆవరణలో వెయ్యి మొక్కలు నాటారు.
మందు కొట్టేందుకు భార్య డబ్బివ్వలేదని భర్త ఆత్మహత్య
మద్యం తాగేందుకు భార్య డబ్బివ్వలేదని మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని సున్నపుగేడు ప్రాంత నివాసి బసురుల్లా, బస్టాండులోని హోటల్లో పనిచేస్తుంటాడు.
మద్యం అలవాటు చేసుకున్న ఆయన తరచూ డబ్బివ్వాలని భార్యను వేధిస్తుంటాడు. శనివారం ఉదయం ఎప్పటిలాగే డబ్బివ్వాలని భార్యను కోరగా, ఆమె నిరాకరించింది. దీంతో బస్టాండు వద్దకు వచ్చిన బసురుల్లా, అక్కడే ఉన్న ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ప్రయాణికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.