జగన్తో ఎందుకీ ఆలింగనాలు..ప్రశంసలు: మోదీ నుండి గవర్నర్ దాకా : అసలు కారణం అదేనా..!
ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అవ్వటం పైన ఆ ప్రముఖ నేతల్లో పట్టలేని సంతోషం. జగన్ను చూడగానే ఆలింగనాలు.. నవ్వుల పువ్వులు.. భుజం తట్టి అభినందనలు. గతంలో జగన్తో ఎప్పుడూ రిజర్వ్గా ఉండే ఆ నేతల్లో పట్టలేని సంతోషం. ఇది..జగన్ ఎన్నికల్లో గెలిచి సీఎం అవుతున్నందుకా..లేక తాము కోరుకున్న విధంగా చంద్రబాబును ఘోరంగా ఓడించనందుకా. ఏపీలో ఓటమితో చంద్రబాబు జాతీయ..తెలంగాణ రాజకీయల పైన దృష్టి పెట్టే ఛాన్స్ లేకుండా పోయింది. ఇక, చంద్రబాబును అంతలా ఓడించిన జగన్ను వారు ఆకాశానికెత్తేస్తున్నారు.
మోదీ..గవర్నర్..కేసీఆర్..ఇలా
ఎన్నికల్లో విజయం తరువాత జగన్ తొలి సారి కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ జగన్ వస్తున్న కారు వద్దకు వచ్చి మరీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ నూతన ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఆలింగనం చేసుకున్నారు. ఇంట్లోకి తీసుకెళ్లి..తాను జగన్కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందీ చెప్పకనే చెప్పారు. జగన్కు స్వాగతం పలకటం కోసం కేసీఆర్తో పాటుగా ఏకంగా తెలంగాణ కేబినెట్ మొత్తం స్వాగతం పలికింది. ఇక, ప్రమాణ స్వీకారానికి సైతం కేసీఆర్తో పాటుగా స్పీకర్, మంత్రులు తరలి వచ్చారు. ఇక, ప్రధాని మోదీ వద్దకు వెళ్లారు. అక్కడా అదే సీన్. ఎప్పుడూ లేని విధంగా జగన్ను ఆలింగనం చేసుకొని భుజం తట్టి శభాష్ అన్నారు. నేనున్నానంటూ హామీ ఇచ్చారు. ఇక, గవర్నర్ లో గతంలో ఎప్పుడూ లేని ఉత్సాహం. విజయవాడకు వచ్చిన గవర్నర్కు కలవటానికి వచ్చిన జగన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఉత్సహంగా మాట మాట కలిపారు. ప్రమాణ స్వీకార వేదిక పైనే అదే పరిస్థితి.
చంద్రబాబును ఓడించినందుకేనా..
ఇప్పుడు జగగన్ను అంతగా అభినందిస్తున్న వారంతా చంద్రబాబు ఆరోపణలకు గురైన వారే. రాకీయంగా చంద్రబాబు ప్రత్యర్ధులే. మోదీ తిరిగి అధికారంలోకి రాకూడదనే లక్ష్యంతో చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేసారు. కూటములు సమావేశాలు నిర్వహించారు. ప్రధానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఒకే వేదిక మీదకు తెస్తున్నట్లు ప్రచారం చేసారు. మోదీ అధికారంలోకి వస్తే దేశానికి నష్టమని చెప్పారు. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి మీద చంద్రబాబు ఎప్పటి నుండో గుర్రుగా ఉన్నారు. ఓటుకు నోటు..తెలంగాణ ఎన్నికలు..డేటా చోరీ అంశాలు వీరి మధ్య గ్యాప్ను మరింతగా పెంచాయి. ఏపీలో చంద్రబాబు ఓడిపోవాలని కేసీఆర్ బలంగా కోరుకున్నారు. ఇక..గవర్నర్ పైనా చంద్రబాబు అనేక ఆరోపణలు చేసారు. గవర్నర్ తనకు వ్యతిరేకంగా కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారని..కేసీఆర్కు ఇచ్చిన ప్రాధాన్యత తనకు ఇవ్వటం లేదని ఆరోపించారు.
జగన్ భుజం పైన తుపాకి పెట్టి...
వీరంతా చంద్రబాబు ఆరోపణలను ఎదుర్కొన్న వారే. ఇక డీఎంకే అధినేత స్టాలిన్ ఇప్పుడు జగన్ ప్రమాణ స్వీకారానికి రావటం..ఆయనతో జత కట్టటం మాత్రం కొత్త పరిణామం. ఏపీలో మోదీ..కేసీఆర్ గురించి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో వ్యతిరేకంగా చెప్పినా..ఎవరు నమ్మలేదు ఏపీలో ఇక టీడీపీ కోలుకోలేదనే నమ్మకం టీఆర్యస్..బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తమను ఇబ్బంది పెట్టటానికి ప్రయత్నించిన చంద్రబాబును..జగన్ ఘోరంగా ఓడించటం తో ఇప్పుడు జగన్ వారికి హీరోగా కనిపిస్తున్నారు. భవిష్యత్లోనూ జగన్కు సహకరించి..చంద్రబాబును దెబ్బ తీసే వ్యూహాలు అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.