గుంటూరును వణికిస్తోన్న 'కాక్సాకీ వైరస్': అంటువ్యాధితో భయాందోళనలో జనం..
గుంటూరు: అతిసార వ్యాధితో దాదాపు 25మంది మృత్యువాత పడ్డ గుంటూరు జిల్లాలో.. ఇప్పుడు మరో వైరస్ కలకలం రేపుతోంది. కాక్సాకీ వైరస్గా చెబుతున్న దీనవల్ల హ్యాండ్ ఫుట్ మౌత్ అనే వ్యాధి ప్రబలుతోంది. ఎక్కువగా చిన్నారులే దీని బారినపడుతున్నారు. వ్యాధి బారినపడ్డ చిన్నారులకు నోరు, చేతులు, కాళ్లు, పిరుదుల భాగాల్లో నీటి కురుపులు వస్తున్నాయి.
ఈ కురుపులతో ఒళ్లంతా జ్వరం, గొంతు నొప్పి, కండరాల నొప్పి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. నోటిలోనూ కురుపులు అవుతుండటంతో తినడం కూడా కష్టంగా మారుతోంది. తినకుండా ఉండటం వల్ల డీహైడ్రేషన్ బారినపడే ప్రమాదం కూడా ఉంది. కాక్సాకీ వైరస్ ఒకరి నుంచి మరొకరికి అంటువ్యాధిలా విస్తరిస్తుందని వైద్యులు చెబుతున్నరు.
వైరస్ సోకిన 3 నుంచి 6 రోజుల్లో దాని లక్షణాలు బయటపడుతాయని చెబుతున్నారు. గడిచిన మూడు నెలల్లో గుంటూరులో ఈ వ్యాధి కేసులు 200వరకు వెలుగుచూశాయి. గతేడాది అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో ఒక్క జీజీహెచ్ వైద్య విభాగంలోనే 60 కేసులు నమోదయ్యాయి. నగరంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో మరో 150కేసుల దాకా నమోదయ్యాయి.
వాతావరణ కాలుష్యం, మలమూత్రాలతో కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి బారినపడ్డ పిల్లలు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఇతరులకు ఇది వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే దీనివల్ల ఇంతవరకు ఎటువంటి మరణాలు సంభవించలేదని తెలిపారు.
వ్యక్తిగత శుభ్రత ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చునని చెబుతున్నారు. కాక్సాకీ వైరస్ లోనూ పలు రకాలు ఉన్నాయని, ఇందులో కాక్సాకీ వైరస్ 16 అంతగా ప్రమాదకరం కాదని అంటున్నారు. హ్యుమన్ ఎంటిరోవైరస్-71 రకం ప్రమాదకరమైనదని చెబుతున్నారు. ఇందులో ఏ4, ఏ7, ఏ9, ఏ10, బీ1, బీ3, బీ5 అనే రకాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.