జగన్ సభలో కూలిన గోడ : పలువురికి తీవ్ర గాయాలు : తొక్కిసలాట..!
వైసిపి అధినేత జగన్ పాల్గొన్న మండపేట ఎన్నికల ప్రచార సభలో అపశృతి చోటు చేసుకుంది. ముమ్మడి వరంలో ప్రచారం పూర్తి చేసుకున్న జగన్..మండపేట సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రచార వాహనం మీదకు చేరుకొని అభివాదం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వైసిపి అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి రావ టంతో..సమీపంలోని భవనాల మీదకు ఎక్కారు. ఒక భవనం పిట్టగోడ కూలటంతో కింద ఉన్నవారి పై పడింది. ఇందు లో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.
తీవ్ర గాయాలు..తొక్కిసలాట..
తూర్పు గోదావరి జిల్లా మండపేట ఎన్నికల ప్రచార సభకు జగన్ హాజరయ్యారు. జగన్ సభా వేదిక వద్దకు వచ్చి తనకు కేటాయించిన వాహనం ద్వారా అభివాదం చేస్తున్నారు. ఆ సమయంలో అమలాపురం వైసిపి ఎంపి అభ్యర్ది మాట్లాడు తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సభ ఏర్పాటు చేసిన సమీపంలోనే పాత భవనం ఉంది. ఆ భవనం మీదకు పెద్ద సంఖ్యలో జనం ఎక్కి సభను వీక్షిస్తున్నారు. కింద కూడా భారీ సంఖ్యలో జనాలు ఉన్నారు. దీంతో...ఆ భవనం పై నుండి పిట్ట గోడ కూలి కింద ఉన్న వారి పైన పడింది. పైన పిట్టగోడ పై కూర్చున్న వారు సైతం కింద పడ్డారు. కిందనే కిక్కిరిసిన జనం మీద ఆ గోడ పడింది. దీంతో..అక్కడ ఉన్న వారిలో చాలా మంది గాయపడ్డారు. పక్కనే మీడియా వారు ఉన్న గ్యాలరీ పై రాళ్లు పడటంతో వారూ గాయపడ్డారు.
వెంటనే ఆస్పత్రికి తరలింపు..
అక్కడ గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగింది. దాదాపు 20 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడే ఉన్న జగన్ వారిని ఆస్పత్రికి తరలించేలా స్థానిక నాయక త్వాన్ని పురమాయించారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అందరూ ఉలిక్కి పడ్డారు. పెద్ద సంఖ్యలో జనం తరలి రావటంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానిక వైసిపి నేతలు చెబుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించిన తరువాత సభ కొనసాగింది. అయితే ఎవరికీ తీవ్ర గాయాలు కాక పోవటంతో సభా నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.
తక్షణం అప్రమత్తం అయిన నేతలు..
గోడ కూలగానే ఒక్క సారిగా గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఆ వెంటనే అక్కడ పెద్ద ఎత్తున జనం ఉండటంతో అంబులెన్స్ లను పిలవటానికి ఇబ్బంది ఏర్పడింది. వైసిపి స్థానిక నేతలు గాయ పడిన వారిని గుర్తించి వారిని ప్రత్యక దారి నుండి వారి వాహనాల్లో ఆస్పత్రికి పంపించారు. ఇదే సమయంలో సభ ఏర్పాటు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైసిపి నేతలను జగన్ సూచించారు.