పాదచారికి పట్టాభిషేకం..ఇలా : ఇప్పటికే చేరుకున్న అభిమానులు: తరలి వస్తున్న ప్రముఖులు వీరే..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మరి కొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్దరాత్రి కురిసిన వర్షానికి సభా వేదిక పాక్షికంగా దెబ్బతింది. అర్దరాత్రి అధికారులు యుద్దప్రాతిపదికన సరి దిద్దారు. జగన్ ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పటికే అభిమానులు ప్రాంగణానికి చేరుకున్నారు. సరిగ్గా జగన్ 12 గంటలకు స్టేడియంకు చేరుకుంటారు. 12.23 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు.
12 గంటలకు జగన్ రాక..
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి సరిగ్గా 12 గంటలకు సభా ప్రాంగణం వద్దకు చేరుఉంటారు. తల్లి విజయమ్మ, సతీమణి భారతి, ఇద్దరు కుమార్తెలు, సోదరి షర్మిళ, షర్మిళ కుమారుడుతో సహా అక్కడకు చేరుకుంటారు. అనంతరం ఓపెన్ జీపులో హాజరైన అతిధులకు అభివాదం చేస్తారు. సరిగ్గా 12.20 గంటలకు గవర్నర్ నరసింహన్ వేదిక వద్దకు చేరుకుంటారు. 12.23 గంటలకు జగన్ ప్రమాణ స్వీకారం చేసారు. 12.35 గంటలకు గవర్నర్ వేదిక నుండి తిరుగు పయనమవుతారు. ఆ వెంటనే జగన్ దాదాపు 20 నిమిషాల సేపు అదే వేదిక నుండి ఏపీ ముఖ్యమంత్రి హోదాలో తొలి అధికారిక ప్రసంగం చేయనున్నారు. అందులో పలు కీలక ప్రకటనలు..నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది.
తరలి వస్తున్న ప్రముఖులు..
జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, సీపీఐ, సీపీఎం జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు హాజరవుతున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ వస్తున్నారని చెబుతున్నా..అధికారికంగా ఖరారు కాలేదు. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మంత్రులు మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్, ప్రశాంత్ రెడ్డి సైతం కేసీఆర్తో పాటుగా వస్తున్నారు. పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, కేవీపి రామచంద్రరావు, చిరంజీవి, ఉండవల్లి, రాం గోపాల్ వర్మ, బిజేపీ ప్రతినిధులు తదితరులు హాజరు కానున్నారు. అయితే, ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల నుండి జగన్ ప్రమాణ స్వీకారం ప్రత్యక్షంగా వీక్షించేందుకే భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.
వేలాది మంది కోసం ఏర్పాట్లు..రెండు వేదికలు..
ఇందిరాగాంధీ స్టేడియంలో 16వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికకు.. అభిముఖంగా వీవీఐపీలు, వీఐపీలు, ప్రత్యేక ఆహ్వానితులు, కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కుటుంబ సభ్యులు కూర్చోటానికి 18 గ్యాలరీలను సిద్ధం చేశారు. అక్కడ 12 వేల మంది కూర్చొనేందుకు వీలుంటుంది. స్టేడియం చుట్టూ ఏర్పాటుచేసిన మరో 20 గ్యాలరీల్లో ఇంకో 15 వేలమంది పడతారు. ఈ గ్యాలరీలను వైసీపీ జెండాలోని నీలం, ఆకుపచ్చ, తెలుపురంగు ల పరదాలతో కప్పేశారు. మొత్తం 11,500 పాసులను అధికారులు జారీచేశారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు ఖర్చు పెద్దగా కాకుండా చూడాలని జగన్.. సీఎస్కు గట్టి ఆదేశాలు ఇచ్చారు. జగన్ ప్రమాణ స్వీకారం మధ్యాహ్నం కావటంతో.. ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా ఉండటానికి ఏసీలు, కూలర్లను ఏర్పాటు చేస్తున్నారు. చల్లటి మజ్జిగ, లస్సీ, లడ్డూ, వడలతో కూడిన స్నాక్స్ వంటివి అందుబాటులో ఉంచారు. భారీ భద్రత ఏర్పాటు చేసారు.