వైయస్ అలా, జగన్ ఇలా.. అవే మైనస్: నంద్యాలపై జగన్ తప్పటడుగు?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి నంద్యాల ఉప ఎన్నిక గట్టి షాకిచ్చింది. జగన్ పార్టీని స్థాపించి ఆరేళ్లు దాటింది.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి నంద్యాల ఉప ఎన్నిక గట్టి షాకిచ్చింది. జగన్ పార్టీని స్థాపించి ఆరేళ్లు దాటింది.
కానీ ఇప్పటి వరకు ఆయనలో రాజకీయ పరిణితి ఇంకా పూర్తిస్థాయిలో కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇలాంటి సమయంలో కొందరు జగన్ను ఆయన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని పోల్చుతుంటారు.
'జగన్! టిడిపి-బిజెపిపై అలాంటి ఆశలు వద్దు, నీ ప్రవర్తన వల్లే'
వైయస్ రాజశేఖర రెడ్డి వద్ద ఉన్న ఓపిక, రాజకీయ నైపుణ్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసం జగన్ వద్ద లేవని అంటున్నారు. జగన్కు ఉన్న ఆవేశం, అతివిశ్వాసం వంటి అంశాలే ఆయనను దెబ్బతీస్తున్నాయని అంటున్నారు.
వైయస్ వినేవారు
వైయస్ రాజశేఖర రెడ్డి ఎవరినైనా నమ్మితే వారి కోసం ఏదైనా చేసేందుకు వెనుకాడరని అంటారు. తాను ఎవరినైతే నమ్మానో వారిపై పూర్తి విశ్వాసంతో ఉండేవారని చెబుతారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఎంతో రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. అయినప్పటికీ తనకు తెలిసిందే కాకుండా స్థానిక నాయకులు చెప్పినది కూడా విని అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకొని, ఆ వ్యూహంతో ముందుకు వెళ్లేవారు.
జగన్ అతివిశ్వాసం
కానీ జగన్ మాత్రం ప్రతి విషయంలో అతివిశ్వాసంతో ముందుకెళ్తున్నారని అంటున్నారు. జగన్ ఇతరుల మాటలు వినరు అనే వాదనలు పలుమార్లు వినవచ్చాయి. ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా ఉంటారనే విమర్శలు ఉన్నాయి.
జగన్ దృష్టి అంతా అక్కడే
జగన్ వద్ద అతివిశ్వాసంతో పాటు ఆవేశం ఉందని అంటున్నారు. ఆయన పార్టీ స్థాపించినప్పటి నుంచీ.. ఎన్నికలు వస్తాయి, నేను సీఎంను అవుతానని భావిస్తూనే ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం మొదలు.. ఇప్పటి వరకు ఆయన తీరు చూస్తే సీఎం పీఠంపై మక్కువ మాత్రమే కనిపిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
వైయస్కు ఎందరో దగ్గర.. జగన్కు దూరం దూరం
వైయస్ రాజశేఖర రెడ్డికి అందరూ దగ్గరివారే. వైయస్ పైన అభిమానంతో జగన్ వద్దకు వచ్చిన పలువురు నేతలు మాత్రం ఆయనకు దూరమయ్యారు. కొండా సురేఖ, సబ్బం హరి, మైసూరా రెడ్డి, నటులు రాజశేఖర్ వంటి ఎందరో.. జగన్పై విమర్శలు చేసి పక్కకు వెళ్లిపోయారు. అందరి మాటను వైయస్ పరిగణలోకి తీసుకుంటే, ఎవరి మాటా లెక్క చేయకుండా తాను చెప్పిందే వినాలనేది జగన్ ఆలోచన అనే విమర్శలు ఉన్నాయి. ఈ వైఖరే ఆయనకు ముఖ్య నేతలను దూరం చేసిందంటారు.
వ్యక్తిగతం.. అవగాహనారాహిత్యం
రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఇప్పుడు సహజమయ్యాయి. కానీ జగన్ మాత్రం ప్రతి దానికీ జగన్నే టార్గెట్ చేస్తున్నారు. చివరకు బిజెపి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా విషయంలోను కమలం పార్టీపై విమర్శలు చేయకుండా చంద్రబాబును తప్పుపడతారు. చంద్రబాబుపై పదేపదే విమర్శలు ఆయనకు మైనస్ అవుతున్నాయని అంటున్నారు. టిడిపి నేతలు కూడా ఆయన కేసులను చూపించి పదేపదే విమర్శలు చేస్తున్నారు.
ఆవేశమా.. ఆలోచనా
ప్రత్యేక హోదా విషయంలోనే జగన్ ఇటీవల ఇరుకున పడ్డారని చెప్పవచ్చు. ఎందుకంటే హోదానే ఏపీకి పరిష్కారమని ఆయన చెప్పారు. హోదా ఇప్పించలేని టిడిపి ఎన్డీయేలో ఉండవద్దని, వారు బయటకు రావాలని జగన్ డిమాండ్ చేశారు. అంతేకాదు, అవసరమైతే మా ఎంపీలతో రాజీనామా చేయిస్తామని చెప్పారు. కానీ మోడీని కలిసిన తర్వాత రాజీనామాలు ఎప్పుడైనా చేయవచ్చుని మాట మార్చారు. హోదా విషయంలో బిజెపిని గట్టిగా నిలదీయకుండా బాబు పైనే విమర్శలు చేశారు. ఆ తర్వాత ఆయన బుక్కయ్యారు.
ఓపిక లేని జగన్.. విసుగు తెప్పిస్తోందా?
వైయస్ రాజశేఖర రెడ్డి సీఎం పీఠంపై కూర్చునేందుకు రెండున్నర దశాబ్దాల పాటు నిరీక్షించారు. కానీ జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచే సీఎం పీఠంపై కన్నేశారు. ఇంకా చెప్పాలంటే పార్టీ పెట్టకముందు వైయస్ చనిపోయినప్పుడే సంతకాలు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ మాత్రం ఎప్పుడూ ఎన్నికలు వస్తాయని, మేమే గెలుస్తామని, నేను సీఎం అవుతానని చెప్పడం విసుగు తెప్పిస్తోందని అంటున్నారు.
రాజకీయంగా ముందుకు..
వైయస్ రాజశేఖర రెడ్డి ఆయా ప్రాంతాల్లో ఆయన నేతలు, కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగా రాజకీయంగా ముందుకు వెళ్లేవారు. కానీ జగన్ స్థానిక నేతలకు కాకుండా ప్రశాంత్ కిషోర్ వంటి వారితో రాజకీయంగా విజయం సాధిస్తామనుకోవడం పూర్తిగా సరైనది కాదని అంటున్నారు. ప్రస్తుత కాలంలో వ్యూహకర్తలు అవసరమే. కానీ మొత్తం వారిపై ఆధారపడటం సరికాదంటున్నారు.
నంద్యాలలో తప్పటడుగు వేశారా?
మూడున్నర ఏళ్ల తర్వాత ఏపీలో నంద్యాల ఉప ఎన్నికలు వచ్చాయి. ఇక్కడ జగన్ రాజకీయంగా తప్పటడుగులు వేశారని అంటున్నారు. తొలుత రాజగోపాల్ రెడ్డి పేరు వినిపించింది. కానీ గంగుల వస్తే ఆయనకు టిక్కెట్ ఇస్తారనే వాదనలు వినిపించాయి. ఆయన అందుకు సిద్ధమయ్యారు కూడా. కానీ చివరకు టిడిపి నుంచి వచ్చిన శిల్పాకు టిక్కెట్ ఇచ్చారు. మూడేళ్లుగా ఏ టిడిపిని అయితే తిట్టారో, అదే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వడం తప్పటడుగే అంటున్నారు. టిడిపి విషయంలో వైసిపి నుంచి భూమా కుటుంబం టిడిపికి వచ్చింది. కానీ వారికి రెండు అనుకూలతలు ఉన్నాయి. ఒకటి అధికార పార్టీ. రెండు వారు భూమా నాగిరెడ్డి చనిపోక ముందే టిడిపిలో చేరారు. కానీ శిల్పా మాత్రం టిక్కెట్ కోసం వైసిపిలో చేరారు.