బీజేపీలోకి క్యూ కట్టిన నేతలు: టీడీపీనే కాదు జనసేన నేతలు: వైసీసీ మాజీ ఎమ్మెల్యే సైతం..!
నవరాత్రులు కావటంతో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో చేరికల సందడి పెరిగింది. ఏపీ లోని పలు పార్టీల నుండి వచ్చిన నేతలు క్యూ కట్టారు. ఇప్పటి వరకు టీడీపీ నుండే ఎక్కవ మంది నేతలు బీజేపీలో చేరారు. అయితే..ఇప్పుడు ఏపీలోని అన్ని ప్రాంతాలకు చెందిన..అన్ని ప్రాంతాల నేతలు క్యూ కట్టిన వారిలో ఉన్నారు. మాజీ మంత్రులు..టీడీపీ మాజీ ఎమ్మెల్సీలు..జనసేన కు రాజీనామా చేసిన నేతలతో పాటుగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే సైతం ఉన్నారు. వీరంతా బీజేపీలో చేరుతున్నారు.
తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవటంతో ఆ పార్టీలోని పలువురు బీజేపీ బాట పట్టారు. అదే విధంగా జనసేనలో కీలక విభాగాల్లో పని చేసిన వారు సైతం కాషాయం కండువా కప్పుకొనేందుకు ఢిల్లీ చేరారు. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ దక్కని నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే చివరి నిమిషం వరకు జగన్ అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయన సైతం ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారు.
బీజేపీలోకి వలసల కోసం ఢిల్లీలో క్యూ...
గత కొద్ది రోజులుగా బీజేపీ నేతలు తమ పార్టీలోకి వచ్చేందుకు అనేక మంది సిద్దంగా ఉన్నారని చెబుతూ వచ్చారు. అయితే కొద్ది రోజులుగా ఆ పార్టీలోకి చెప్పుకోదగిన స్థాయిలో చేరికలు లేవు. అయితే, ఇప్పుడు నవరాత్రులు కావటం..మంచి రోజులనే ఆలోచనతో ఏపీకి చెందిన పలు పార్టీలకు చెందిన నేతలు ఆ పార్టీలకు రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు. వారంతా ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో వారు బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్ ను కలిసారు. పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు.
ఇప్పటికే టీడీపీ నుండి రాజ్యసభ సభ్యులుగా ఉన్న నలుగురు బీజేపీలో చేరికతో టీడీపీ నుండి మొదలైన చేరికలు..ఆ తరువాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి అన్నం సతీష్ ప్రభాకర్.. చందు సాంబశివరావుతో సహా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వంటి వారు ఉన్నారు. జనసేన నుండి ఇప్పటికే రావెల కిషోర్ బాబు బీజేపీలో చేరిపోయారు. ఇక, తాజాగా అనేక మంది బీజేపీ లో చేరేందుకు ఢిల్లీ చేరుకున్నారు.
టీడీపీ మాజీ నేతలే ఎక్కవగా..
బీజేపీలో చేరుతున్న వారిలో ఎక్కువగా టీడీపీలో క్రియాశీలకంగా పని చేసిన వారే ఉన్నారు. వారిలో మాజీ మంత్రి శనక్కాయల అరుణ, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఉన్నారు. వాకాటి మీద గతంలో సీబీఐ విచారణలు జరిగాయి. దీంతో..ఆయన్ను టీడీపీ సస్పెండ్ చేసింది.
అదే విధంగా గుంటూరు జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ పాతూరి నాగభూషణం, తోట నగేష్, గట్టి చిన్న సత్యనారాయణ ఉన్నారు. వీరు ఇప్పటికే రాం మాధవ్ ను కలిసారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో వారు పార్టీలో చేరనున్నారు. అదే విధంగా గుంటూరు జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రులు రామినేని ఫౌండేషన్ ఛైర్మన్ గా ఉన్న రామినేనది ధర్మ ప్రచారక్ సైతం బీజేపీలో చేరుతున్నారు.
జనసేనకు రాజీనామా చేసి..మాజీ హైకోర్టు జడ్జి సైతం..
ఇక గత ఎన్నికల్లో జనసేన నుండి పోటీ చేసిన ఓడిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఇప్పటికే బీజేపీలో కొనసాగుతున్నారు. తాజాగా గత ఎన్నికల్లో జనసేన నుండి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిన చింత పార్ధసారధి జనసేనకు రాజీనామా చేసారు. ఆయన సైతం నడ్డా సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు. ఇక, హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన పదవీ విరమణ చేసిన నక్కా బాలయోగి సైతం బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు.
ఆయన గత ఎన్నికల సమయంలో టీడీపీ నుండి అమలాపురం ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దమయ్యారని ప్రచారం జరిగింది. ఆయన చంద్రబాబుతోనూ అప్పట్లో సమావేశమయ్యారు. కానీ, ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పుడు బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు బీజేపీలోకి..
2014 ఎన్నికల్లో వైసీపీ నుండి చిత్తూరు జిల్లా పూతలపట్టు నుండి ఎమ్మెల్యేగా గెలిచిన పూతలపట్టు రవి సైతం కాషాయ కండువా కప్పుకుంటున్నారు. ఆయన ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధినేత టిక్కెట్ నిరాకరించారు. దీంతో..ఆయన జగన్ ను కలిసేందుకు లోటస్ పాండ్ వద్ద నిరీక్షించటం వార్తల్లోకెక్కింది.
కుటుంబ సభ్యులతో సహా లోటస్ పాండ్ వద్దకు వచ్చినా జగన్ అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఆ తరువాత ఆయన రాజకీయంగా టీడీపీ వైపు ప్రయత్నం చేసారు. కానీ, ఆ ఎన్నికల్లో వైసీపీ నుండి ఎం బాబు గెలుపొందారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కొద్ది రోజులు మౌనంగా ఉన్న రవి..ఇప్పుడు బీజేపీలో చేరేందుకు డిల్లీకి చేరుకున్నారు.