నాడు రోజాకు జరిగిందే ..నేడు అచ్చెన్నాయుడుకు: వైసీపీ నేతల కోరిక అదే : మరి..జగన్ ఏమన్నారు..!
Recommended Video
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినా..గత అయిదేళ్ల కాలంలో జరిగిన పరాభవాలు మర్చిపోలేకపోతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో మీరు చేసిందే ఇప్పుడు మేము చేస్తున్నామంటూ వైసీపీ నేత లు సభలోనే టీడీపీకి తేల్చి చెబుతున్నారు. ఇదే సమయంలో మరో ఆసక్తి కర డిమాండ్ వైసీపీ నేతలు తెర మీదకు తీ సుకొస్తున్నారు. నాడు శాసనసభలో వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయటం..కోర్టు చెప్పినా తాజా ఎన్నికల వరకు సభలోకి రాకుండా చేయటం వైసీపీ నేతలు మర్చిపోలేక పోతున్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకో వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ వారు ఏం డిమాండ్ చేస్తున్నారంటే..
విజయసాయి.. యడియూరప్ప.. మధ్యలో హిమాలయ వాటర్ బాటిల్!
రోజాను అసెంబ్లీకి రానీయకుండా..
టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జరగిన కాల్ మనీ వ్యవహారం పైన నాడు సభలో చర్చ మొదలైంది. అప్పటికే సభలో రోజాతో పాటుగా వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం ముందు నిలబడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసారు.ఆ సమయంలో రెండు పక్షాల మధ్య కొంత టెన్షన్ ఏర్పడింది. రోజా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ ఏకంగా ఏడాది పాటు సస్పెండ్ చేసారు. రోజాకు వివరణ చెప్పుకొనే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ తరువాత రోజా ఈ నిర్ణయం మీద న్యాయ పోరాటం చేసారు. తొలుత హైకోర్టు రోజాను సభలోని అనుమ తించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, సాంకేతిక అంశాలను లేవనెత్తి సభలోకి రోజాను అనుమతించ లేదు. ఇక..ఆ తరువాతి కాలంలో వైసీపీ ఏకంగా సమావేశాలనే బహిష్కరించింది. ఫలితంగా రోజా ఆనాటి నుండి తిరిగి ఇప్పుడు రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచే వరకూ శాసనసభలోకి అడుగు పెట్టే అవకాశం కోల్పోయారు.
ఇప్పుడు..అచ్చెన్నాయుడు పైనా అలా చేయాలంటూ..
ప్రస్తుత టీడీఎల్పీ ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడు పైన వైసీపీ ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. గత అయిదేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అచ్చెన్నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మీద చేసిన వ్యాఖ్య లను వైసీపీ ఎమ్మెల్యేలు సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికీ వాటిని పదే పదే గుర్తు చేస్తున్నారు. ప్రధానంగా జగన్ పైన వ్యక్తిగత దూషణలకు దిగిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. జగన్ను ఉద్దేశించి నీవు మగాడివైతే..నీకు మగతనం ఉంటే..నీలో ప్రవహించేదీ రాయలసీమ రక్తం అయితే..అంటూ చేసిన వ్యాఖ్యలను తాజాగా మంత్రి బుగ్గన సైతం సభలో ప్రస్తావించారు. అయితే, అచ్చెన్నాయుడును ఈ సమావేశాల వరకు సభ నుండి సస్పెండ్ చేసారు. ఇదే సమయంలో వైసీపీఎల్పీ కార్యాలయంలో సీనియర్ ఎమ్మెల్యే మధ్య ఆసక్తి కర చర్చ సాగింది. అచ్చెన్నాయుడు నాడు మంత్రిగా ఉన్నా..ఇప్పుడు ప్రతిపక్ష ఉప నేతగా ఉన్నా ఒకేలా వ్యవహరిస్తున్నారని..ఆయన పైన గతంలో రోజా మీద టీడీపీ తీసుకున్న తరహాలో నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు.
జగన్ దృష్టికి సైతం ఇదే డిమాండ్..
అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాల పైన ముఖ్యమంత్రి వద్ద వైసీపీ నేతలతో సమావేశం జరగుతున్న సమయం లో ఈ అంశం ఒక ముఖ్య నేత ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి చెవిరెడ్డిని ఉద్దేశించి ఏంటీ సభలో అచ్చెన్నాయుడులా మాట్లాడుతున్నావంటూ సభలో టీడీపీ నేతను బంట్రోతు అంటూ చేసిన వ్యాఖ్యల పైన సున్నింగా మందలించారు. అదే సమయంలో నాటి ప్రభుత్వం చేసిన విధంగా మనం చేయాల్సిన అవసరం లేదని.. కానీ, ఎవరైనా సభలో ప్రొసీడింగ్స్కు అడ్డు తగిలితే మాత్రం ఖచ్చింగా కఠినంగా ఉండాల్సిందేనని స్పష్టం చేసారు. సభలో అచ్చెన్నాయుడు సీటు చంద్రబాబు పక్కన నుండి వెనక్కు మార్చటంతో ఇరకాటంలో పడ్డారని..అది మంచి వ్యూహం అంటూ మరో విప్ వ్యాఖ్యానించారు. అయితే..అచ్చెన్నాయుడు మాత్రం సభలో ఇక అధికార పార్టీకి లక్ష్యంగా మారుతున్నారనేది మాత్రం సుస్పష్టం.