చంద్రబాబు పై సీఎస్ల ఆగ్రహం దేనికి : అధికారులు ఎందుకు దూరమవుతున్నారు: కారణం అదేనా..!
రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం. 14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా కీర్తి. బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా ప్రచారం. అటువంటి వ్యక్తి నాయకత్వంలో పని చేసిన అధికారులు ఆయనకు ఎందుకు దూరమవుతున్నారు. చంద్రబాబు 1995 నుండి 2004 వరకు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసారు. ఆ రోజుల్లో అనేక మంది కీలక అధికారులు ఆయన హయాంలో పని చేసారు. తిరిగి, రాష్ట్ర విభజన తరువాత 2014లో ఆయన ఏపీ సీఎం అయ్యారు. కానీ, ఇక్కడ పరిస్థితి మరోలా ఉంది. ఆయన వద్ద పని చేసిన సీఎస్లతో సహా..అనేక మంది అధికారులు అయనకు దూరమయ్యారు. ఇక, ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ప్రత్యక్ష వార్ నడుస్తోంది. అసలు కారణం ఏంటంటే..
ఆ ఇద్దరు సీఎస్లు వ్యతిరేకంగా..
ఉమ్మడి రాష్ట్ర చివరి..విభజన జరిగినాక తొలి సీఎస్గా పని చేసిన ఐవైఆర్ కృష్ణారావు ఆ బాధ్యతల నుండి పదవీ విరమణ చేసిన తరువాత బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్గా నియమితులయ్యారు. ఆ పదవిలో ఉండగానే చంద్రబాబు గురించి కొన్ని ట్వీట్లు చేసారు. దీంతో, ఆయన్ను ఆ పదవి నుండి తప్పించారు. అప్పటి నుండి ఆయన కొంత కాలం ఒంటరిగా పోరాటం చేసారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. ఇక, మరో సీఎస్ ఠక్కర్. అయనతో ఎటవంటి ఇబ్బంది లేనప్పటికీ..ఆయన ప్రభుత్వం ప్రతిపాదించిన అనేక ఆర్దిక పరమైన అనుమతులను తిప్పి పంపారు. అజయ్ కళ్లాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన సమయంలో అనేక అంశాలను వెలుగులోకి తెచ్చారు. ఆయన పదవీ విరమణ చేసిన తరువాత ప్రభుత్వ పెద్దల లొసుగులు..ముఖ్యంగా రాజధాని అంశంలో తెర చాటు వ్యవహారాల పైన ఓపెన్గానే ఫైర్ అయ్యారు. ఐవైఆర్..అజయ్ కళ్లాం ఓపెన్గానే చంద్రబాబు నిర్ణయాలను తప్పు బడుతున్నారు. వారి పైనా కుటుంబరావు లాంటి వారిని ఎదురుదాడి కోసం ప్రభుత్వం వినియోగిస్తోంది.
ఢిల్లీ బాట పట్టిన అధికారులు..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో చంద్రబాబు ఏరి కోరి కొంత మంది అధికారులను తెచ్చుకున్నారు. వారిలో ఐఏయస్ అధికారి గిరిధర్ను తొలుత తన కార్యాలయంలో నియమించుకొని..ఆ తరువాత కీలకమైన రాజధాని వ్యవహారాలను పర్యవేక్షించటానికి మున్సిపల్ శాఖ అప్పగించారు. అయితే, రాజధాని వ్యవహారంలో జరుగుతున్న వ్యవహారాల కారణంగానే ఆయన సుదీర్ఘ కాలం సెలవులో వెళ్లి..ఆ తరువాత మున్సిపల్ శాఖ నుండి తప్పుకున్నారు. ఇక, అదే మున్సిపల్ శాఖ పర్యవేక్షించిన డి సాంబశివరావు సైతం కొంత కాలం అందులో కొనసాగిన తరువాత టీటీడీ ఈవోగా వెళ్లారు. దీంతో..రాజధాని వ్యవహారాలను మున్సిపల్ శాఖ నుండి తప్పించి..అజయ్ జైన్కు అప్పగించారు. ఆర్దిక శాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన పీవీ రమేష్ సైతం ఏపిలో వద్దని..కేంద్ర సర్వీసులకు వెళ్లారు. కొద్ది రోజుల క్రితమే తిరిగి ఏపీకి వచ్చారు. ఇక, సీఆర్డీఏ కమిషనర్గా పని చేసిన శ్రీకాంత్ తనను రాజధాని పనుల నుండి తప్పించాలని కోరటంతో ఆయన్ను జీఏడీ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు.
ఇప్పుడు ఎల్వీ..కారణం అదేనా..
పాలనా వ్యవహారాల్లో చంద్రబాబుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే, ఎన్నికల సంఘం నియమించిన సీఎస్ తనను లెక్క చేయకుండా..గతంలో తీసుకున్న నిర్ణయాలను తవ్వి తీస్తున్నారనే కారణంతోనే చంద్రబాబుతో ఆటుగా టీడీపీ నేతలు వరుసగా ఎల్వీని టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, ఎన్నికల సమయంలో నిధుల సర్దుబాటు పేరుతో తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తున్న కారణంగానే..ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర సైతం సెలవు పైన వెళ్లారు. ఇక, ఇప్పుడు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బిల్లుల చెల్లింపుల విషయంలోనూ ఆంక్షలు పెడుతున్నారు. ఆర్దిక సంవత్సరం తొలి నెలలోనే వేల కోట్ల అప్పులు ఎందుకు తేవాల్సి వచ్చిందని నిలదీస్తున్నారు. ఇక, ప్రభుత్వంలో అనేక స్థాయిల్లో లోపాయి కారీ ఒప్పందాలు జరుగుతున్నాయని..వాటిలో తాము భాగస్వాములం కాలేక అధికారులు ఏపీ నుండి రిలీవ్ అవుతున్నారనే చర్చ సచివాలయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారం ఏపిలోనే కాదు జాతీయ స్థాయిలో అధికారులు..కేబినెట్ మధ్య ఏర్పుడుతున్న అగాధం చర్చగా మారింది.