తిరుగుబాటా..సర్దుబాటా: నాడు రేవంత్ రెడ్డి ..నేడు టీడీపీ ఎంపీల జంప్ వెనుక: చంద్రబాబు సూచన మేరకే
ఇప్పుడు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరాలనే నిర్ణయం వెనుక ఏం జరిగింది. ఇది టీడీపీ ఎంపీల తిరుగుబాటా లేక భవిష్యత్ ప్రయోజనాల కోసం చేసుకుంటున్న సర్దుబాటా. టీజీ వెంకటేష్ లాంటి నేతలు మాత్రం తాము టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పామని..ఆయన వారించినా.. ఆయనకు సమాచారం ఇచ్చిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసారు. అదే సమయంలో వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు సూచన మేరకే టీడీపీ ఎంపీ లు బీజేపీలో చేరుతున్నారని ఆరోపిస్తున్నారు. అవీనీతి..అక్రమాలు బయటకు రాకుండా ఈ వ్యూహం అమలు చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది.ఇదే సమయంలో నాడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి పంపిన చంద్రబాబు ఇప్పుడు అదే వ్యూహాన్ని బీజేపీతో అమలు చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు..
తిరుగుబాటా..సర్దుబాటా..
టీడీపీ రాజ్యసభ సభ్యులు..అధినేత చంద్రబాబుకు వీర విధేయులు అయిన వీరు టీడీపీని వీడి బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, అందులో సుజనా చౌదరి..సీఎం రమేష్ లాంటి వారు ఉండటం కొత్త చర్చకు కారణం అవుతోంది. ఇదే సమయంలో తమను ప్రత్యేక శిబిరంగా గుర్తించాలని కోరతూ సంతకాలు చేసిన వారిలో ఒకరైన టీజీ వెంకటేష్ తాము వారం క్రితమే చంద్రబాబుకు ఈ విషయం చెప్పామని..పార్టీ మారి..నష్టం చేయవద్దని ఆయన కోరారని చెప్పుకొచ్చారు. అంటే చంద్రబాబుకు ముందస్తు సమాచారం ఉన్నా..వారిని నియంత్రించటంలో సీరియస్గా వ్యవహరించలేదా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో ఎంపీలు వ్యక్తిగతంగా ఉన్న అవసరాలను సైతం దృష్టిలో ఉంచుకొని బీజేపీలో చేరుతున్నారనే వాదన వినిపిస్తోంది. మరో అయిదేళ్ల వరకూ వేచి చూసినా.. రాజకీయంగా ఏం జరుగుతుందనే స్పష్టత వీరిలో కనిపించటం లేదు. దీంతో..ఇది నిజంగా టీడీపీ మీద వీరిది తిరుగుబాటా లేక రాజకీయంగా సర్దుబాటా అనే కోణంలో చర్చ మొదలైంది.
రేవంత్ రెడ్డి అంశాన్ని ప్రస్తావిస్తూ..
గతంలో టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని వ్యూహాత్మకంగానే చంద్రబాబు కాంగ్రెస్లోకి పంపారనే ప్రచారం సాగింది. దీని కారణంగా ఎన్నికల వేళ..చంద్రబాబు పైన ఉన్న ఓటుకు నోటు వ్యవహారం చర్చకు రాకుండా చేయగలిగారు. ఆ తరువాత చంద్రబాబు సైతం స్వయంగా రాహుల్ నివాసానికి వెళ్లి స్నేహ హస్తం అందించారు. మోదీతో విబేధాల తరువాత రాహుల్ ప్రధాని అవుతారని చెబుతూ మద్దతు కోసం ప్రయత్నించారు. దీంతో..ఇప్పుడు సైతం చంద్రబాబు అదే తరహాలో వ్యూహాన్ని అమలు చేస్తున్నారా..అందులో భాగంగానే అత్యంత ముఖ్యులు బీజేపీలోకి వెళ్లటాన్ని ఈ వాదనకు మద్దతుగా ప్రస్తావిస్తున్నారు. అయితే, ఏపీలో ఇక టీడీపీకి భవిష్యత్ లేకనే మరి కొంత మంది నేతలు సైతం బీజేపీలోకి వస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు మరింత ధీమాగా చెబుతున్నారు.
Recommended Video
చంద్రబాబు సూచన మేరకే..
ఇదే సమయంలో వైసీపీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు చంద్రబాబు సూచనల మేరకే టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నారని ఆరోపించారు.తన అవినీతి, అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. అందుకే తన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేరాలని చంద్రబాబు వారికి పరోక్షంగా సూచించారని ఆయన ఆరోపించారు. టీడీపీ ఎంపీలను బీజేపీలో చేర్చేందుకే బాబు విదేశి పర్యటన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కానీ, చంద్రబాబు మాత్రం తాము రాష్ట్రం కోసమే బీజేపీతో పోరాటం చేసామంటూ..బీజేపీ నేతల చర్యలను ఖండించారు. అయితే సుజనా.. టీజీ లాంటి వారు మాత్రం చంద్రబాబుకు చెప్పే పార్టీ మారామంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఖచ్చితంగా చంద్రబాబును ఇరకాటంలో పడేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.