మేయర్ అనురాధ హత్యలో ఎన్నో ట్విస్ట్లు: రూ.2 కోట్లు చేతులు మారాయా?
చిత్తూరు: మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో రోజుకో కొత్త ట్విస్ట్! పోలీసుల అదుపులో ఉన్న నిందితుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. మామ కటారి మోహన్, మేనళ్లుల మధ్య ఉన్న దూరాన్ని మరింత పెంచేందుకు కొంతమంది కీలకంగా పని చేసినట్లుగా విచారణలో తేలిందని సమాచారం.
మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, చింటూ బంధువు, ప్రస్తుతం టిడిపిలో కొనసాగుతూ చింటూకు ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి, గతంలో ఎర్ర చందనం అక్రమ రవాణాలో ఉన్న స్థానిక నాయకుడు, ఓ కార్పొరేటర్ భర్త, చింటూకు వ్యాపార భాగస్వామిగా ఉంటున్న ఓ వ్యక్తి ఈ మొత్తం ఘటనలో కీలక భూమిక పోషించినట్లు పోలీసులు భావిస్తున్నారని తెలుస్తోంది.
వీరిని విచారిస్తే మరిన్ని విషయాలు రాబట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో ఇప్పటికే కొందరిని విచారించారని సమాచారం. మిగతా వారిని కూడా విచారించేందుకు నోటీసులు సైతం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
చింటూ పేరెంట్స్ ఆత్మహత్యాయత్నంపై ట్విస్ట్
మరో ఆసక్తికర విషయమేమంటే.. చింటూ తల్లిదండ్రులు ఆత్మహత్యకు యత్నించినట్లు కొన్ని న్యూస్ ఛానళ్లలో స్క్రోలింగులు వచ్చేటట్టు పోలీసులే చేసి వారిని స్టేషన్కు తీసుకువచ్చిట్లుగా చెబుతున్నారు. తద్వారా చింటూ కంగారు పడి కాల్ చేస్తాడని భావించారని సమాచారం. ఈ విషయాన్ని చింటూకు ఒకరు చెప్పారని తెలుస్తోంది.
మేయర్ దంపతుల హత్య కేసులో.. చింటూ అనుచరులు, స్నేహితులు, సంబంధం ఉన్న సహాయకులకు పోలీసు అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు సహకరించాలని ఆదేశించారు. చిత్తూరు నగరం గంగనపల్లెకు చెందిన వారే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న కొంతమందికి కూడా పోలీసు అధికారులు నోటీసులను అందించారు.
చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో 15 మందికి నోటీసులు జారీ చేయగా, చిత్తూరు రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో 13 మందికి అందించారు. ఇలా నోటీసులు అందుకున్న వారందరిని పోలీసు స్టేషన్కు రప్పించారు. ఒక్కొక్కరిని రహస్యంగా విచారిస్తున్నారు. మరో 40 మందికి నోటీసులు జారీ చేయవచ్చు.
రూ.2 కోట్లు చేతులు మారాయా?
చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో పోలీసులు వేగం పెంచారు. పోలీసులు చింటూ ఆస్తుల సీజ్ చేశారు. చిత్తూరు నగరం మురకంబట్టులోని చింటూ వైన్ షాప్ను సీజ్ చేసిన పోలీసులు చిత్తూరు జిల్లాలోని యాదమరి మండల పరిధిలో చింటూ నిర్వహిస్తున్న గ్రానైట్ క్వారీ వద్దకెళ్లి అక్కడి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోనూ చింటూ ఆస్తులు కూడబెట్టాడన్న వార్తలతో ఆ దిశలోను దృష్టి సారించారు.
ఇదిలా ఉండగా, హత్యల వెనుక పెద్ద ముఠా హస్తం ఉందని, రూ.2 కోట్ల వరకు చేతులు మారాయని పోలీసులు అనుమానిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కిరాయి హంతకులతో కలిసి ఊచకోతలను సాగించిన వాడు చింటూనే అని పోలీసులు ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారని సమాచారం.