ఏపీ సర్కార్ పై మావోల ఆగ్రహం .. లేఖతో పాటు ఆడియో టేప్ విడుదల
కరోనా వైరస్ ప్రభావం ఏపీలో దారుణంగా పెరుగుతుంది. విపరీతంగా పెరుగుతున్న కేసులకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణం అని మావోయిస్ట్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది . దేశంలో, రాష్ట్రంలో కరోనా మరణాలకు కేంద్ర సర్కార్ , రాష్ట్ర ప్రభుత్వాలు నైతిక బాధ్యత వహించాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెరుగుతున్న కరోనా కేసులకు , పెరుగుతున్న మరణాలకు బాధ్యత వహించాలని సీపీఐ మావోయిస్టు పార్టీ ఈస్ట్ విశాఖ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ లేఖ రాశారు .
ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంత ప్రజలను పూర్తిగా విస్మరించింది అని మండిపడ్డారు . ఏజెన్సీ ప్రాంత ప్రజల దాకా కరోనా వ్యాప్తి చెందుతుంది అంటే అది కచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు . ఈ మేరకు అరుణ లేఖతో పాటు ఆడియో టేపు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని . ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను ఏమాత్రం పట్టించుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టిందని ధ్వజమెత్తారు.
ప్రజల ఆరోగ్యం కోసం అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్తున్న సర్కార్ కోట్లలో మాస్కులు, లక్షల్లో టెస్టింగ్ కిట్లు కొన్నామని గొప్పలు చెప్పుకుంటుందని మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటి వరకు కరోనా నివారణ చర్యలు చేపట్టలేదన్నారు. సిక్కోలు దాకా కరోనా కేసులు పెరుగుతున్నా , ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ ఒక్క మాస్క్ గానీ, శానిటైజర్ గానీ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యాధిబారిన పడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా కరోనాతో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు.ఇక ప్రభుత్వ తీరు మార్చుకోవాలని ప్రజల ప్రాణాలను రక్షించటానికి పని చెయ్యాలని లేఖ ద్వారా పేర్కొన్నారు .