నక్సల్స్ ఘాతుకం: ఎమ్మెల్యే కిడారి దారుణ హత్య, మాజీ ఎమ్మెల్యే కూడా మృతి, చంద్రబాబు దిగ్భ్రాంతి
అరకు: విశాఖపట్నం మన్యంలో మావోయిస్టులు ఆదివారం మళ్లీ పంజా విప్పారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కిడారి అక్కడికి అక్కడే కన్నుమూశారు. ఆయనతో పాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే శివేరి సోముపై కూడా కాల్పులు జరిపారు. అతను కూడా చనిపోయారు. దాదాపు 50 మంది మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నారు.
కిడారి ఇటీవలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన 2014లో వైసీపీ నుంచి గెలిచారు. కిడారిని మావోయిస్టులు గతంలో పలుమార్లు హెచ్చరించారు. ఆయన 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. డుంబ్రిగూడ మండలంలోని తుటంగి గ్రామ సమీపంలో మావోయిస్టులు రెచ్చిపోయారు.
చంద్రబాబు దిగ్భ్రాంతి
ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే శివేరు సోము హత్యపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. కిడారి, శివేరు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రబాబు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభ్యున్నతికి కిడారి, శివేరి సోము చేసిన సేవలను కొనియాడారు. దాడులు, హత్యలు మానవత్వానికే మచ్చ అన్నారు. ప్రజాస్వామ్యవాదులు అందరూ దీనిని ఖండించాలన్నారు.
ఏస్పీ ఎం చెప్పారంటే?
దాడి ఘటనపై స్పష్టత రాకముందు ఎస్పీ రాహుల్ దేవ్ మాట్లాడారు. సర్వేశ్వర రావుపై మావోయిస్టులు కాల్పులు జరిపినట్లుగా సమాచారం వస్తోందని, దాడి జరిగిందని తమకు సమాచారం వచ్చిందని, మావోయిస్టుల దాడిని నిర్ధారించేందుకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు.