నల్లమలలోమరో మావోయిస్టుల డంప్ లభ్యం
కర్నూలు జిల్లా: నల్లమలలో మరో మావోయిస్టుల డంప్ లభ్యమైంది. కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీసులు మంగళవారం రాత్రి 7గంటల ప్రాంతంలో నల్లమలలో తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల సందర్భంగా నాగలూటి వీరభద్రాలయానికి, చెంచుగూడేనికి మధ్యలో భూమిలో 4 అడుగుల లోతున పాతిపెట్టిన ప్లాస్టిక్ డ్రమ్మును గుర్తించారు. అందులో లైవ్ గ్రనేడ్, ఒక వైర్లెస్ సెట్, 40 జిలెటిన్ స్టిక్స్, 35కి పైగా గ్రనేడ్స్తో పాటు వాటి తయారీకి ఉపయోగించే సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. 2004 కు ముందు నల్లమలలో మావోయిస్టుల ఉనికి చాలా ఎక్కువగా ఉండేదన్న సంగతి తెలిసిందే.
అయితే నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించిన మరిన్ని డంప్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సమీపంలో, గుంటూరు జిల్లాలో రేమిడిచర్ల అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న డంప్ లు చిన్నవే అయినప్పటికి దట్టమైన అటవీ ప్రాంతంలో శక్తిమంతమైన పేలుడు పదార్థాలు, ఇతరత్రా సామగ్రిని దాచి ఉంటారనే సందేహాలు వ్యక్తవౌతున్నాయి.
రాష్ట్ర విభజన తరువాత నల్లమల అటవీ భూములను అభివృద్ధిపరంగా వినియోగంలోకి తీసుకురావాలని ఎపి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా అనంతపురం - అమరావతి ఎక్స్ప్రెస్ హైవే రూటు డిజైన్ కూడా సిద్దం చేస్తున్నట్లు సమాచారం. దీంతో నల్లమల ప్రాంతంలోకి ఇక మావోయిస్టులు పున:ప్రవేశం చేసే వీలులేకుండా చేసేందుకు పోలీసు యంత్రాంగం కూంబింగ్ను ముమ్మరం చేసింది.
దీనికితోడు కొన్ని బహుళజాతి కంపెనీలు ఇప్పటికే నల్లమల అటవీ సంపదపై కన్నేసినట్లు తెలుస్తోంది. రంగురాళ్ల తవ్వకాలు, విదేశీ డాక్యుమెంట్ల చిత్రాల పేరుతో అటవీ ప్రాంతంలో పరిశోధనలు జరుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కొన్నిచోట్ల వజ్రాలు, నిధి నిక్షేపాల కోసం కూడా తవ్వకాలు జరుగుతున్నాయి. మరోవైపు ఫ్యాక్షన్ ప్రాంతాలకు రవాణా చేసే బాంబులు, నాటు తుపాకులను కూడా కొందరు అక్రమార్కులు తయారు చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వంతో మావోయిస్టుల చర్చలు విఫలమైన అనంతరం 2005 తరువాత పోలీసులు నల్లమల ప్రాంతాన్నిజల్లెడపట్టడంతో వారు ఏఒబి, చత్తీస్గఢ్ ప్రాంతాలకు మకాం మార్చారు. అయితే ప్రస్తుతం ఆ రెండు ప్రాంతాల్లో పెద్దఎత్తున ఎన్కౌంటర్లు, నిర్బంధం కొనసాగుతుండటంతో తిరిగి నక్సల్స్ నల్లమలలోని స్థావరాలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా తీవ్రతరం చేసి కూంబింగ్లు జరుపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఈ నల్లమల అటవీ ప్రాంతం సుమారు 430 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.