టీడీపీ ఎమ్మెల్యేను కాల్చి చంపిన టాప్ మావోయిస్టు లీడర్ లొంగుబాటు: దళంలో ప్రాంతీయ భావాలతో..
విశాఖపట్నం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమ దారుణ హత్యోదంతంలో ప్రధాన పాత్ర పోషించిన టాప్ మావోయిస్టు లీడర్ లొంగిపోయారు. ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రిషికేష్ డీ ఖిల్లారి సమక్షంలో లొంగిపోయారు. ఆయన లొంగుబాటు ఫలితంగా మావోయిస్టులకు పెట్టనికోటగా భావిస్తూ వస్తోన్న ఆంధ్రా-ఒడిశా బోర్డర్ (ఏఓబీ) దళం బలహీనపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
Save Tamil Nadu: తమిళనాడులో వైఎస్ జగన్ పోస్టర్లు: హీరో విజయ్, ప్రశాంత్ కిశోర్లతో..!
దళంలో చేరిన రెండేళ్లలోనే కీలక పదవులు..
ఆ మావోయిస్టు పేరు జిప్రో హబీకా. వయస్సు 30 సంవత్సరాలు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా నారాయణపట్న పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజాగూడ ఆయన స్వగ్రామం. తల్లిదండ్రులు బాలీ హబీకా, అర్షా అబికా వ్యవసాయదారులు. 2012లో మావోయిస్టు దళంలో చేరారు. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. 2014-15లో కోరాపుట్ జిల్లాలోని పొట్టంగి, ఛత్తీస్గఢ్లోని ఇంద్రబస్తీ అడవుల్లో చోటు చేసుకున్న ఎన్కౌంటర్లల్లో జిప్రో హబీకా ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
రూ.4 లక్షల రివార్డు..
2016లో పొట్టంగి పోలీస్స్టేషన్ పరిధిలోని పుటేరులో సర్పంచ్ జీ సుందర్ రావును కాల్చి చంపారు. పలు వాహనాలను తగులబెట్టిన ఘటనలకు హబీకా నాయకత్వాన్ని వహించినట్లు కోరాపుట్ పోలీసులు వెల్లడించారు. ఒడిశా ప్రభుత్వం ఆయనపై నాలుగు లక్షల రూపాయల రివార్డును కూడా ప్రకటించింది. ఆయన కోసం ఒడిశా పోలీసులు విస్తృతంగా గాలిస్తున్న సమయంలోనే.. విశాఖపట్నం జిల్లా అరకులోయలో హత్యాకాండను కొనసాగించారు.
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యాకాండ..
2018 సెప్టెంబర్ 24వ తేదీన అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరు సోమలను కాల్చి చంపారు. ఈ ఘటన అప్పట్లో అటు ఏఓబీ సరిహద్దుల్లో ప్రకంపనలను సృష్టించింది. ఆ ఘటన తరువాత కూడా హబీకా మావోయిస్టు దళంలో క్రియాశీలకంగా పనిచేశారు. 2019లో కోరాపుట్ జిల్లా పడువా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిట్వా వద్ద చోటు చేసుకున్న ఎన్కౌంటర్కు సారథ్యాన్ని వహించారు.
మావోయిస్టుల్లో ప్రాంతీయ భావాలు..
తాజాగా- జనజీవన స్రవంతిలో కలిసిపోవాలనే నిర్ణయంతో పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. ఏఓబీ సహా ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లల్లో క్రియాశీలకంగా ఉన్న మావోయిస్టు గ్రూపుల్లో ప్రాంతీయ భావాలు తలెత్తాయని, దాని పట్ల విసిగిపోయిన జిప్రో హబీకా జనజీవన స్రవంతిలో కలిసి పోవాలని నిర్ణయించుకున్నట్లు మల్కాన్గిరి జిల్లా ఎస్పీ తెలిపారు. దీనితోపాటు- మాజీ మావోయిస్టుల కోసం ఒడిశా ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాల పట్ల ఆయన ఆకర్షితులయ్యారని చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.