విశాఖ మన్యం మైనింగ్ మాఫియాపై మావోయిస్ట్ నేత గణేష్ లేఖ .. వాళ్ళను తరిమికొట్టాలని పిలుపు
మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మావోయిస్టులు ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో ఒక లేఖ ఇప్పుడు విశాఖ మన్యంలో కలకలం రేపింది.
వైసీపీ మైనింగ్ మాఫియా.. ఎన్జీటీ విచారణతో జగన్ రెడ్డి అండ్ కో, ఆ అధికారులకు చిప్పకూడే : నారా లోకేష్
విశాఖ మన్యంలో గత కొంత కాలంగా మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని, లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలకు పాల్పడుతోంది అని గత కొంత కాలంగా ఏపీలో ప్రతిపక్ష పార్టీ టిడిపి అధికార వైసీపీ పై పోరాటం చేస్తూనే ఉంది. దీనిపై నిత్యం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ కమిటీని వేసి అక్రమ మైనింగ్ పై విచారణ జరిపించాలని, సమగ్ర నివేదికను అందించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
తాజాగా విశాఖ మన్యంలో మైనింగ్ మాఫియా గురించి లేఖ రాసిన మావోయిస్టు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ మన్యంలో లేటరైట్ ముసుగులో జరుగుతున్న బాక్సైట్ తవ్వకాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మన్యం నుంచి మైనింగ్ మాఫియాని తన్ని తరిమేయాలని ఆయన తన లేఖలో సూచించారు. అధికార పార్టీ నాయకులను నిలదీయాలని గణేష్ తన లేఖ ద్వారా స్పష్టం చేశారు.
Recommended Video
అల్లూరి సీతారామరాజు వారసులుగా మరో మన్యం పితూరీ కి సిద్ధం కావాలని, మన్యాన్ని కాపాడుకోవాలని గణేష్ పిలుపునిచ్చారు. అంతేకాదు ఆదివాసీల న్యాయమైన పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాల్సిందిగా లేఖ ద్వారా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ కు వ్యతిరేకంగా ఈ నెల 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న బందును విజయవంతం చేయాలని గణేష్ తన లేఖ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు.