మావోయిస్టు లాంఛనాలతో ఆర్కే అంత్యక్రియలు-హాజరైన గిరిజనులు : బస్తర్ అటవీ ప్రాంతంలోనే...!!
మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) కు మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నెల 14వ తేదీన ఉదయం 6 గంటలకు ఆర్కే మృతి చెందినట్లు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటించింది. 14వ తేదీ సాయంత్రానికే పోలీసుల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఆర్కే మృతిపై అధికారికంగా ప్రకటన విడుదలైంది. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో ఆర్కే బాధపడుతున్నారని, చికిత్స అందించినప్పటికీ కాపాడుకోలేకపోయామని ప్రకటనలో పేర్కొన్నారు.
కిడ్నీలు ఫెయిల్ అవ్వటంతో
డయాలసిస్ చేస్తుండగానే ఆర్కే ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పార్టీ శ్రేణుల సమక్షంలోనే ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని దక్షిణ బస్తర్ అడవుల్లో ఆర్కే తుదిశ్వాస విడిచినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, ఆర్కే మరణించారనే విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు..స్థానిక గిరిజనులు అక్కడకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఆర్కే అంత్యక్రియల ఫొటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది.
15వ తేదీన మధ్నాహ్నం అంత్యక్రియలు
15వ తేదీ మధ్నాహ్నం బస్తర్ అటవీ ప్రాంతంలోనే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఆర్కే పైన ఎర్రజెండా ఉంచి మావోయిస్టులు నివాళులు అర్పించారు. ఆర్కే మరణం పైన మావోయిస్టు పార్టీ అధికారి కంగా ప్రకటన చేసిన తరువాత ఆయన సతీమణి శిరీషా విలపించారు. తన బిడ్డ ఇప్పటికే ఉద్యమం కోసం అమరుడయ్యడని..ఎప్పుడూ ప్రజల కోసం ఆలోచించే తన భర్త ఆర్కే ఇప్పుడు ఉద్యమంలో మరణించారని చెప్పుకొచ్చారు.
భార్య..ప్రజా సంఘాల ఆరోపణలు
అయితే, ఆయనకు చికిత్స అందకుండా ప్రభుత్వం కుట్ర చేసిందంటూ కళ్యాణ్ రావు ఆరోపించారు. నాలుగు దశాబ్దాల పాటు ఉద్యమంలో కీలకంగా పని చేసిన ఆర్కే అప్పటి ఏపీ ప్రభుత్వంతో చర్చల సమయంలో బయటకు వచ్చారు. ఆ తరువాత పార్టీలో క్రియాశీలకంగా మారారు. పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన ఆర్కే విప్లవ ఉద్యమం వైపు ఆకర్షితులై అప్పటి నుంచి మావోయిస్టు ఉద్యమం లోనే కొనసాగుతూ..అనారోగ్యం తో మరణించారు.