కలకలం:విశాఖ మన్యంలో మళ్లీ మావోయిస్టుల పోస్టర్లు...టిడిపి,బిజెపిలని తరిమికొట్టాలని పిలుపు
విశాఖపట్నం:విశాఖపట్టణం జిల్లాలో మావోయిస్టుల పేరిట తాజాగా ప్రత్యక్షమైన పోస్టర్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జీకే వీధి మండలం ఆర్.వి.నగర్ ఏపీఎఫ్డీసీ కార్యాలయం సమీపంలో కనిపించిన ఈ బ్యానర్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
గాలికొండ ఏరియా కమిటీ పేరుతో ఏపీఎఫ్డీసీ ఆఫీసు గేటుకు బ్యానర్లు ఏర్పాటుచేయగా, ఆ చుట్టుప్రక్కల పరిసరాల్లో భారీగా కరపత్రాలు కనిపించినట్లు సమాచారం. ఏపీఎఫ్డీసీ శ్రమదోపిడీకి పాల్పడుతుందని ఆరోపించడంతో పాటు టిడిపి, బిజెపి లను తరిమికొట్టాలనేది ఆ బ్యానర్లు, పోస్టర్ల సారాంశం. వివరాల్లోకి వెళితే...
విశాఖ మన్యంలో జీకే వీధి మండలం ఆర్.వి.నగర్ ఏపీఎఫ్డీసీ కార్యాలయం సమీపంలో మావోయిస్టుల పేరిట వెలిసిన బ్యానర్లు,పోస్టర్లు సంచలనం సృష్టించాయి. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం తెల్లవారుజామున వీటిని వెదజల్లినట్లు సమాచారం.చట్టాల ప్రకారం అడవిపై హక్కు ఆదివాసీలదే అయినప్పటికీ అంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది సంస్థ(ఏపీఎఫ్డీసీ) శ్రమ దోపిడీకి పాల్పడుతోందని మావోయిస్టులు ఆరోపించారు.
కాఫీ తోటలపై పూర్తి హక్కు గిరిజనులదే అని, కాఫీ బోర్డును తరిమికొట్టాలని పేర్కొన్నారు. అలాగే బాక్సైట్ బాక్సైట్ తవ్వకాలు చేపట్టి గిరిజనుల బతుకులను నాశనం చేయడానికి పూనుకున్న కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలు టిడిపి, బిజెపి నాయకులను మన్యం నుంచి తరిమి కొట్టాలని మావోయిస్టులు ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు.
ఇటీవలే అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చిచంపిన క్రమంలో తాజాగా మళ్లీ మావోయిస్టుల పేరిట పోస్టర్లు, బ్యానర్లు కనిపించడం పై స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. అయితే ఇవి నిజంగానే మావోయిస్టులే విడుదల చేశారా? ...లేక వారి పేరిట ఎవరైనా బెదిరించేందుకు ఈ పని చేశారా అనేది తేలాల్సివుంది.