అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యలపై మావోల లేఖ?...గతంలోనూ ఒక లేఖ:ఏది నిజం!
విశాఖపట్టణం:అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను తామే హతమార్చామని...వారు గిరిజన ద్రోహులుగా మారినందుకే హత్య చేశామని పేర్కొంటూ తాజాగా మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.
ప్రాధమిక పరిశీలన ప్రకారం ఈ లేఖను అసలైన మావోలే విడుదల చేసివుండొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో...ఇక ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలను చంపింది మావోయిస్టులేననేది నిర్ధారణ అయినట్లేనని స్థానికులు భావిస్తున్నారు. శుక్రవారం జగబంధు పేరుతో మావోయిస్టులు ఈ లేఖ విడుదల చేయడమే కాకుండా అందులో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల కాల్చివేతను సమర్థించుకుంటూ కారణాలను వివరించారు.
ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను లివిటిపుట్టు దాడిలో మావోయిస్టులు హతమార్చి 40 రోజులు గడుస్తోంది. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ప్రజాప్రతినిథుల హత్యలకు కారణాలు వివరిస్తూ మావోల నుంచి ఎలాంటి లేఖ విడుదల కాకపోవడంతో అనేక అనుమానాలు వెల్లువెత్తాయి. అసలు ఈ హత్యలను చేసింది మావోలేనా అని అనుమానించేంత వరకు పరిస్థితి వెళ్లింది. అయినా మావోల నుంచి స్పందన లేకపోవడం పెనుదుమారం రేపింది.
ఆ తరువాత సుదీర్ఘ విరామం తరువాత ఇటీవల ఏవోబీ స్పెషల్ జోనల్ అధికార ప్రతినిధి పేరు మీదట ఎమ్మెల్యేనే తామే హతమార్చినట్లు లేఖ విడుదలైనా ఎందుకో అది మావోలే రాశారని నమ్మకం వ్యక్తం కాలేదు. ఈ తరుణంలో జగబంధు పేరుతో తాజాగా మావోయిస్టులు విడుదల చేసిన లేక అది సాధారణంగా నక్సల్స్ విడుదల చేసే లేఖ మాదిరిగానే ఉండటంతో ఇది మావోలే రాసివుంటారనే అభిప్రాయం వ్యక్తం అయింది.
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ఆదివాసీ నేతలు కాదని గిరిజన ద్రోహులని...వీళ్లు మైనింగ్ మాఫియాగా మారి ఆదివాసీల సంపదను దోచుకున్నారని మావోలు పేర్కొన్నారు. పార్టీలు మారినా ఎమ్మెల్యే కిడారి మాత్రం డబ్బు సంపాదనకు అర్రులు చాచారని మావోయిస్టులు ఆరోపించారు. అందుకే మెజార్టీ ప్రజల అభిమతం మేరకే వారికి శిక్ష విధించామని మీడియాకు విడుదల చేసిన తమ లేఖలో మావోయిస్టులు వెల్లడించారు.
వీరు గిరిజన ద్రోహులుగా మారారని...బాక్సైట్ తవ్వకాల కోసం జిందాల్, రస్ ఆల్ ఖైమా, ఆన్ రాక్లకు ఏజెంట్లుగా మారి డబ్బును స్వాహా చేశారన్నారు. బాక్సైట్ తవ్వకాలకు కిడారి, సివేరి సోమలు అనుకూలంగా వ్యవహరించారని, గూడ క్వారీ విషయంలో ఎన్నోసార్లు మావోయిస్టులు వీరిని హెచ్చరించారన్నారు. బహుళ జాతి కంపెనీలకు దళారీలు, ప్రజా వ్యతిరేకులని తెలిపారు.
బాక్సైట్ తవ్వకాల జీవో నెంబర్ 97 పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలకు దశాబ్దాలుగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. యూపీఏ, ఎన్డీఏ, కాంగ్రెస్, టీడీపీ ఇందుకు మినహాయింపు కాదని ధ్వతమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట...ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆదివాసీ, అటవీ సంపదలను అక్రమంగా దోచుకునే కార్యక్రమాలను వెంటనే ఆపేయాలని లేఖలో వీరు హెచ్చరించారు.