కిడారికి పట్టిన గతే మీకూ పడుతుంది: ఎమ్మెల్యే యరపతినేనికి మావోయిస్టుల బహిరంగ లేఖ
గుంటూరు: సార్వత్రిక ఎన్నికలకు సమాయాత్తమౌతున్న గుంటూరు జిల్లాలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అనూహ్యంగా మావోయిస్టులు తెర మీదికి వచ్చారు. బహిరంగ లేఖలతో ప్రకంపనలు పుట్టించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన గురజాల సిట్టింగ్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును బెదిరిస్తూ, మావోయిస్టు నాయకులు లేఖలు రాశారు. యరపతినేని సహా మరికొందరి పేర్లను ఈ లేఖలో పొందుపరిచారు. మావోయిస్టు పల్నాడు ప్రాంతీయ కమిటీ పేరుతో ఈ లేఖలు వెలుగు చూశాయి.
కియా మోటార్స్ కీలక నిర్ణయం! చైనాలోని కార్ల తయారీ ప్లాంట్ మూసివేత! అనంతపురం ప్లాంట్ పై ప్రభావం?
అక్రమ మైనింగ్ కు పాల్పడుతూ, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన యరపతినేని శ్రీనివాస రావు తన ప్రవర్తనను మార్చుకోవాలని మావోయిస్టులు హెచ్చరించారు. లేకపోతే.. కిడారి సర్వేశ్వరరావుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. యరపతినేనితో పాటు పగడాల భాస్కర్ రావు, తంగెళ్ల శ్రీనివాసరావు, నాయిబ్రాహ్మణ ఫెడరేషన్ ఛైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు, దాచేపల్లి ఎంపీపీ నవకుమార్, మునగా నిమ్మయ్య పేర్లను కూడా లేఖలో పొందుపరిచారు.
గురజాల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని దాచేపల్లిలోని మోడర్న్ స్కూల్ సమీపంలో ఈ లేఖలు గోడకు అంటించి కనిపించాయి. అవినీతి పరులకు, బూర్జువా రాజకీయ పార్టీల నాయకులకు మావోయిస్టు పార్టీ వారి బహిరంగ హెచ్చరిక అనే శీర్షికతో రెండు పేజీల ఈ లేఖలు వెలుగు చూడటం స్థానికులను కలవరానికి గురి చేసింది.
ఈ లేఖలు దాచేపల్లి మోడ్రన్ స్కూల్ దగ్గర వెలిశాయి. గతంలోనూ పలుమార్లు ఇలాంటి లేఖలే దర్శనమిచ్చాయి. అయితే, ఓ వైపు ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో మావోయిస్టు పార్టీ పల్నాడు రీజనల్ కమిటీ పేరుతో వెలిసిన ఈ లేఖలు చర్చనీయంగా మారాయి.
అక్రమ మైనింగ్, అక్రమ వ్యాపారాలు, బినామీ వ్యాపారాలు, వసూళ్లకు యరపతినేని పాల్పడుతున్నారని మావోయిస్టులు పేర్కొన్నారు. దీనికి సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులకు, అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులకు ప్రజాకోర్టులో విచారణ, శిక్షలు తప్పవని హెచ్చరించారు. గత పదేళ్ల కాలంలో యరపతినేని చేసిన అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను మభ్య పెట్టడానికి ఏర్పాటు చేసిన ఆటల పోటీల్లో తమ దళ సభ్యులు హత్య చేయడానికి అవకాశం ఉండిందని, చివరి అవకాశం ఇవ్వదలచి వదిలి వేశామని మావోయిస్టులు చెప్పారు.
ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు అందాల్సిన ప్రజాధనాన్ని అవినీతిమయం చేస్తూ, దోచుకుంటున్న యరపతినేని నేరాలు శిక్షార్హమైనవని అన్నారు. అవినీతికి సంబంధించిన వివరాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. అవినీతి, నేరప్రవృత్తిని తగ్గించుకుని సాధారణ జీవనం గడపాలని హెచ్చరిస్తున్నట్లు మావోయిస్టులు చెప్పారు. లేకపోతే ప్రజా కోర్టులో తగిన శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.
తెలుగుదేశం పార్టీలో చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హతమార్చిన విషయం తెలిసిందే. కిడారితో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివేరు సోమను గత ఏడాది సెప్టెంబర్ లో మావోయిస్టులు కాల్చి చంపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దగా లేదనుకున్న మావోయిస్టుల ఉనికి కిడారి హత్యతో వెలుగులోకి వచ్చింది. కిడారి హత్యోదంతం నేపథ్యంలో తాజాగా మరోసారి యరపతినేనిని హెచ్చరిస్తూ బహిరంగ లేఖ రాయడాన్ని.. తేలిగ్గా తీసుకోలేమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.