ఏవోబీలో మావో అగ్రనేతలు.. వారోత్సవాల కోసం వారం ముందే రాక.. పోలీసుల కూంబింగ్..
ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో పరిస్థితి నివురుగప్పినా నిప్పులా ఉంది. ఈ నెల 28 నుంచి అమరవీరుల వారోత్సవాలు జరగనుండటంతో మావోయిస్టు అగ్రనేతల రాకతో హై టెన్షన్ నెలకొంది. ఇప్పటికే మావో అగ్రనేతలు ఏవోబీలో గల తూర్పుగోదావరి, విశాఖపట్టణం, ఒడిశా సరిహద్దుల్లోకి వచ్చారని పోలీసులు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినట్టు సమాచారం. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో బాంబు, డాగ్ స్వ్కాడ్తో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.
కాల్పులతో ఐదుగురు మావోల హతం..
గతేడాది వారోత్సవాల సమయంలో ఎదురుకాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఐదుగురు మావోయిస్టులు చనిపోవడంతో ఎర్రదండు ఆగ్రహంతో ఉంది. సాయుధ దళాలకు శిక్షణ ఇచ్చేందుకు అగ్ర నేతలు వచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 28వ తేదీ నుంచి వారోత్సవాలు ప్రారంభం అవుతుండగా.. వారం రోజుల ముందే వారు వచ్చారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు విసృతంగా గాలింపు చేపట్టారు.
వారోత్సవాలకు ముందు..
గతనెల 3వ తేదీన చింతూరు మండలం ఏనుగు రాళ్లపల్లి, పేగ గ్రామాల మధ్య రహదారిపై రాళ్లు పడేశారు. అంతకుముందు జూన్ 6వ తేదీన చింతూరు మండలం సరివెల-వెంకట్రాయపురం రహదారిపై ఆరు వాహనాలను కూడా దగ్దం చేశారు. ఈ రెండు ఘటనలు మధ్యాహ్నాం జరగడం.. దాదాపు 200 మంది మావోయిస్టు సానుభూతిపరులు పాల్గొనడం పోలీసు వైఫల్యాన్ని చాటింది.
Recommended Video
ఉనికి చాటే యత్నం..?
గత రెండేళ్లుగా మన్యంలో కిమ్మనకుండా ఉన్న మావోలు... తమ బలాన్ని ప్రదర్శించారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కూడా ఏవోబీతోపాటు చింతూరు మండలంపై పోలీసులు ఫోకస్ చేశారు. వారోత్సవాలు ముగిసేలోగా ఎలాంటి విధ్వంసం జరుగుతుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. అటు మావోయిస్టులు ఉనికి చాటే యత్నం చేయనుండగా.. తిప్పికొట్టేందుకు పోలీసులు యత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏవీబో పరిసర ప్రాంత ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు.