టీడీపీ నేతలకు వార్నింగ్ ఇస్తూ మావోల లేఖ .. ఓ మంత్రితో పాటు కిడారి శ్రవణ్, గిడ్డి ఈశ్వరి టార్గెట్
విశాఖ మన్యంలో కలకలం రేగింది . మరోసారి మావోయిస్టులు తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలు మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రవణ్, గిడ్డి ఈశ్వరిలను హెచ్చరిస్తూ మావోలు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి కైలాసం పేరుతో ఉన్న ఈ లేఖలో, ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆరుగురు రైతులను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఆదివాసీల ఓట్లతో గెలిచి ఆదివాసీలకు ఏం చేస్తున్నారని టీడీపీ నేతలను నిలదీసిన మావోలు
టీడీపీ నేతలు మంత్రి అయ్యన్నపాత్రుడు, కిడారి శ్రవణ్, గిడ్డి ఈశ్వరిలను హెచ్చరిస్తూ మావోలు రాసిన లేఖలో ఆదివాసీల ఓట్లతో గెలిచిన మీరు ఆదివాసీల కోసం ఏం చేస్తున్నారు? అంటూ తమ లేఖలో మావోలు టీడీపీ నేతలను నిలదీశారు. మే 1న వంచుల పంచాయతీలోని పనసలొద్ది, కొత్త వెదురుపల్లి గ్రామాలపై పోలీసులు దాడులు చేసి.. ఆరుగురు గిరిజన రైతులను అక్రమంగా నిర్బంధించారు. పోలీసులు వారిని చిత్రహింసలకు గురిచేశారు. వారిని విడిచిపెట్టాలని గ్రామస్తులు, గూడెం పోలీసులు చుట్టూ తిరిగినా వీరిని పట్టించుకునే వారు లేరు.' అని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు.
ఆదివాసీలుగా ఉండి దోపిడీ వర్గాలకు కొమ్ముకాస్తే ప్రజలే బుద్ధి చెప్తారు .. లేఖలో హెచ్చరిక
అంతే కాదు "ప్రజలను అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలు పెడుతుంటే, ఆదివాసీలుగా ఉండి దోపిడీ వర్గాల కొమ్ముకాస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ నాయకులుగా మీ ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందని భావిస్తున్నాం. అరెస్ట్ చేసిన రైతులను విడిచిపెట్టాలి . దీనిపై మీరు వెంటనే స్పందించి అరెస్టయిన ప్రజలను విడుదల చేయించకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు" అంటూ తమ లేఖలో పేర్కొన్నారు.
ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమల హత్యల నుండి భయం గుప్పిట్లో మన్యం
ఈ లేఖ ద్వారా మావోలు మరోమారు ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికలకు ముందు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు హత్య చేసిన ఘటన నాటి నుండి మావోలు ఏదో ఒక రకంగా తమ ఉనికిని చాటుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తూ రాసిన లేఖ ఏజెన్సీలో టెన్షన్ పుట్టిస్తుంది.