మావోయిస్టులూ!...వచ్చే ఎన్నికల్లో పోటీచేయండి:ఎపి డిజిపి ఠాకూర్ సూచన
విశాఖపట్నం:మావోయిస్టులు అనుసరిస్తున్న హింసాత్మక విధానం సరైంది కాదని...దాని వల్ల ప్రయోజనం లేదని...వారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడాలని ఎపి డీజీపీ ఆర్పీ ఠాకూర్ హితవు పలికారు. మావోయిస్టులు వచ్చే ఎన్నికల్లో పాల్గొని, రాజ్యాంగబద్ధంగా మెలగాలని ఆయన సూచించారు.
మంగళవారం విశాఖ నగర పోలీసు కమిషనరేట్ని డిజిపి ఆర్ పి ఠాకూర్ సందర్శించారు. అనంతరం పోలీసుల అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నగర పోలీసు కమిషనర్ మహేష్చంద్ర లడ్హాతో కలిసి రక్తదానం చేశారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ గంజాయి సాగు, రవాణాతో ప్రమేయం ఎన్న వ్యక్తులు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
భద్రత పెంచాం...డిజిపి ఠాకూర్
ఇటీవల అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు హత్యచేసిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులందరికీ భద్రత పెంచామని ఎపి డిజిపి ఆర్ పి ఠాకూర్ తెలిపారు. లివిటిపుట్టు ఘటన తర్వాత ఏజెన్సీలో కూంబింగ్ ముమ్మరం చేశామని, ఇటీవలే జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మీనా హతమైన విషయం తెలిసిందేనన్నారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ బూటకమనడం సరికాదని.. మావోయిస్టులు విడుదల చేసిన ఆడియో టేప్లో 5.45 గంటలకు కాల్పులు జరిగాయని వాళ్లే అంగీకరించారని అన్నారు. గిరిజనులకు చేరువయ్యేందుకు శాఖా పరంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డిజిపి వెల్లడించారు.
రక్తదానం అంటే...ప్రాణదానమే
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా విశాఖ నగర పోలీసులు మంగళవారం ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదానం చేయడం అంటే ఆపదలో వున్న వేరొకరికి ప్రాణదానం చేయడమేనని డీజీపీ ఠాకూర్ చెప్పారు. నగర పోలీసులు ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరంలో డిజిపి ఠాకూర్ కూడా రక్తదానం చేశారు. ఆయనతోపాటు సీపీ మహేష్ చంద్ర లడ్హా కూడా రక్తదానం చేశారు
గంజాయి...ఎవరినీ ఉపేక్షించం
గంజాయి రవాణా, వ్యాపారంతో ప్రమేయం కలిగిన వ్యక్తులు ఎంతటి వారైనాసరే వదిలిపెట్టేది లేదని డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఈ సందర్భంగా స్పష్టంచేశారు. గంజాయి రవాణా చట్టవిరుద్ధమని, అందులో నక్సలైట్లు మాత్రమే కాదు పోలీసుల ప్రమేయం ఉన్నా ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే ఉండదని తేల్చిచెప్పారు. ఏజెన్సీలో గంజాయి సాగు,రవాణాల పై మరింత దృష్టి సారించి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు డిజిపి వివరించారు.
ఎస్పీ రాహుల్ దేవ్...ప్రెస్ మీట్
మరోవైపు మావోయిస్టులకు సహకరిస్తున్న ఇద్దరు సానుభూతిపరులను అరెస్ట్ చేసినట్లు విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ తెలిపారు. మంగళవారం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ...జననాట్య మండలి సభ్యురాలు, మహిళా మావోయిస్టు భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణ అలియాస్ పద్మ, మావోలకు కొరియర్గా పనిచేసే లంబూరి సింహాచలాన్ని తాము అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
సానుభూతిపరులకు...హెచ్చరిక
వీరిద్దరూ మావోల సంఘ విద్రోహ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఏజెన్సీ వ్యాపారస్తులు, గంజాయి వ్యాపారస్తులు, కాంట్రాక్టర్ల నుంచి మావోల తరఫున డబ్బులు వసూలు చేయడం, ప్రజాకోర్టులకు గిరిజనులను సమీకరించడం, పోలీసుల సమాచారాన్ని చేరవేయడం చేస్తుంటారని ఎస్పీ వివరించారు. మావోయిస్టులకు వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఇతరులు నగదు రూపంలోగాని...వస్తురూపంలోగాని లేదా ఏరకంగానైనా సహాయం చేసినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. మావోలకు సహకారం అందించే మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని కోరారు.