ఇంత జరుగుతున్నా మళ్లీ మావోయిస్టుల బహిరంగసభ...ఎంత ధైర్యం?:మధ్యలో మంత్రి అయ్యన్న కలకలం
అమరావతి:అరకు ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేలపై దాడి నేపథ్యంలో మావోయిస్టుల కోసం పోలీసులు ఒకవైపు జల్లెడ పడుతుండగానే మావోలు మరో చోట భారీ బహిరంగసభ నిర్వహించడం ద్వారా పోలీసులకు మళ్లీ షాక్ ఇచ్చారు.
లివిటిపుట్టు దాడి తర్వాత తమ ఆచూకి కోసం భారీస్థాయిలో పోలీసులు జరుపుతున్న కూంబింగ్ తో మావోయిస్టులు బ్రతుకు జీవుడా అనుకుంటూ ఎక్కడో చెట్టుకొకరు పుట్టకొకరు తలదాచుకుంటూ ఉంటారనుకుంటే, వాళ్లు మాత్రం ఆంధ్రా ఒడిశా బోర్డర్ లో ఏకంగా భారీ బహిరంగ సభే నిర్వహించి పోలీసులకు పెను సవాలు విసిరారు. పైగా ఈ సభకు మావోయిస్టు అగ్రనేతలు కూడా హాజరై ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారట. ఈ నేపథ్యంలో మంత్రి అయ్యన్న చేసిన ఒకపని పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. వివరాల్లోకి వెళితే...
మావోలు...మరో సవాల్
ఆంధ్రా ఒడిశా బోర్డర్ లో తమకు ఉన్న పట్టును మావోయిస్టులు మరోసారి పోలీసులకు చాటిచెప్పారు. అరకులో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ లను హతమార్చి 10 రోజులు కూడా గడవకముందే వారు మళ్లీ ఏవోబీలో బహిరంగసభ నిర్వహించారు. పైగా ఈ సభలకు వేలాదిమంది గిరిజనులు ఎర్రజెండాలు, ఒరియా భాషలో రాసిన బ్యానర్లతో ఊరేగింపుగా వెళ్లి మరీ హాజరయ్యారు.
అక్కడే...బహిరంగ సభ
రెండేళ్ళ క్రితం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో తమ మావోయిస్టులను భారిగా నష్టపోయిన కటాఫ్ ఏరియాలోని బలిమెల- రామ్గూడ ప్రాంతంలోనే మావోలు తాజాగా ఈ బహిరంగ సభను నిర్వహించడం గమనార్హం. ఈ సభకు మావోయిస్టు అగ్రనేతలు హాజరవడంతో పాటు బలిమెల రిజర్వాయర్, వంతెన నిర్మాణాలపై ప్రభుత్వాలపై మండిపడ్డారట. బలిమెల రిజర్వాయర్ వల్ల గిరిజనులు నష్టపోతున్నారని...పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చేందుకే ప్రాజెక్ట్ పై గురుప్రియ వంతెన నిర్మించారని మావోయిస్టులు ఈ సభలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఒడిశాకు...వార్నింగ్
వీటివల్ల గిరిజనులకు ఒరిగిదేమీ లేదని...ఆదివాసీలు నాశనమవుతారని తెలిసీ ప్రభుత్వం ఈ వంతెన నిర్మించిందని మావోయిస్ట్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారట. బలిమెల జలాశయం వల్ల పోడు వ్యవసాయం అంతా నీటిపాలవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇక్కడి పంటలు దెబ్బతినడమే కాకుండా...వెయ్యికిపైగా పశువులు మృత్యువాత పడ్డాయని...దీనికి కారణం రిజర్వాయర్ లో నీటిమట్టం ఎక్కవగా ఉండటమేనని...వెంటనే నీటి మట్టాన్ని తగ్గించాలని మావోలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీర్మానం చేశారట. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలంటూ ఓడిశా ప్రభుత్వాన్ని హెచ్చరించారట.
అయ్యన్న కలకలం...పోలీసుల అసహనం
ఒకవైపు ఇంతజరుగుతుంటే మావోల హిట్ లిస్ట్ లో ఉన్న ప్రజాప్రతినిధుల భద్రత కల్పించే విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ సతమతమై పోతున్నారు పోలీసులు. ఇలా మావోల హిట్ లిస్టు లో ఉన్న మంత్రి అయ్యన్నపాత్రుడుకు కూడా భారీ భద్రత కల్పించగా ఆయన అవేమీ పట్టించుకోకుండా మంగళవారం సాయంత్రం సరదాగా తన స్నేహితులతో కలసి మంగళవారం సాయంత్రం నర్సీపట్నంలో అత్యంత రద్దీగా ఉండే శ్రీకన్య కూడలిలోని ఒక హోటల్కు వెళ్లి ఇతర కస్టమర్ల మధ్య అల్పాహారం తీసుకుంటూ హల్ చల్ చేయడం పోలీసులను ఇబ్బంది పెట్టింది. పోలీసులు ఇప్పటికే ఆయనకు బులెట్ ప్రూఫ్ వాహనం భద్రతను కూడా కల్పించగా ఆయన అదేమీ పట్టించుకోకుండా ఇలా చేయడంపై పోలీసు అధికారులు తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.