ప్రత్యేక హోదాకు మావోయిస్టుల మద్దతు...లేఖలు విడుదల
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ మావోయిస్టులు ఆదివారం రెండు లేఖలు విడుదల చేయడం సంచలనం సృష్టించింది. ఏవోబీ కార్యదర్శి చంద్రమౌళి పేరుతో తెలుగులో తొలుత ఓ లేఖ విడుదల కాగా...ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఆంధ్రా ఒడిశా బోర్డర్ స్పెషల్ జోన్) పేరుతో మరో లేఖ విడుదలైంది.
అయితే ఏవోబీ కార్యదర్శి చంద్రమౌళి పేరిట లేఖను ఒడిశాలోని మల్కన్గిరి సమీపంలో విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ న్యాయమైందని, దాన్ని అమలు చేయాలని మావోయిస్టులు కోరారు. అయితే ప్రత్యేక హోదా పెట్టుబడిదారుల హోదాను కాకుండా... ప్రజల హోదాను పెంచేదిగా ఉండాలని మావోయిస్టులు లేఖలో పేర్కొనడం విశేషం.
ప్రియమైన ప్రజల్లారా అంటూ ప్రజలను సంబోధిస్తూ సాగిన ఈ లేఖలో...ప్రత్యేక హోదా అనేది ఎన్నికల లాబీయింగ్ ద్వారా కాకుండా....పోరాటం తో సాధించుకోవాలని మవోయిస్టులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మేధావులు ఏకమవ్వాలని సూచించారు. ఈ లేఖ విడుదలైన కొన్ని గంటల అనంతరం మావోయిస్టుల మరో గ్రూప్ నుంచి ఇంకో లేఖ విడుదలైంది.
ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించాయంటూ...కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఆంధ్రా ఒడిశా బోర్డర్ స్పెషల్ జోన్) పేరుతో ఈ లేఖ విడుదలైంది. సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో నాటకాలాడుతున్నారని మావోయిస్టులు ఈ లేఖలో విమర్శించారు. హోదాకోసం ప్రజలు పోరాడితే రాష్ట్రానికి పెట్టుబడులు రావని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందన్న విషయం మరిచిపోవద్దంటూ చంద్రబాబు గతంలో ప్రజలను హెచ్చరించారని మావోయిస్టులు ఈ లేఖలో గుర్తుచేయడం గమనార్హం. అయితే మావోయిస్టుల్లో కూడా రెండు గ్రూపులు ప్రత్యేక హోదాపై ఇలా రెండు లేఖలు విడుదల చేయడం చర్చనీయాంశం అయింది.