బాబుతోపాటు మరో సీఎంకు మావోల నుంచి ముప్పు: హోంశాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచివుందని కేంద్ర హోంశాఖ శనివారం హెచ్చరించింది.
న్యూఢిల్లీ: మావోయిస్టుల కదలికలపై కేంద్ర హోంశాఖ నిఘా పెట్టింది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలకు, నేతలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచివుందని కేంద్ర హోంశాఖ శనివారం హెచ్చరించింది.
చంద్రబాబునాయుడుకు భద్రత మరింత పెంచాలని ఏపీ పోలీసు శాఖకు సూచించింది. ఈ మేరకు ఏపీ డీజీపీ కార్యాలయానికి లేఖ పంపినట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ సూచనల నేపథ్యంలో ఏపీ పోలీసు శాఖ అప్రమత్తమైంది.
చంద్రబాబునాయుడుకు భద్రత పెంచేందుకు ఏపీ పోలీసు శాఖ సన్నద్ధమైంది. కాగా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతోపాటు ఒడిశా ముఖ్యమంత్రికి కూడా మావోయిస్టుల నుంచి ముప్పు పొంచివుందని కేంద్రహోంశాఖ హెచ్చరించింది.
అంతేగా, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలకు కూడా మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారంగానే మావోలు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.