మావోయిస్టుల సానుభూతిపరులను లేకుండా చేయాలి...అప్పుడే సేఫ్:మాజీ డిజిపి నండూరి
విశాఖపట్టణం:అరకులో మావోయిస్టుల దాడి చాలా దురదృష్టకరమైన సంఘటన అని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని ఎపి మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు చెప్పారు.
సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతాలు ఎప్పుడు సురక్షితమనేది వివరించారు. ఏదేని ప్రాంతాల్లో పెద్ద ఎన్ కౌంటర్ జరిగినప్పుడో లేదా కూంబింగ్ జరిగినప్పుడో అక్కడ మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందని సహజంగా అందరూ భావిస్తుంటారని కానీ అవి నిజంకాదని మాజీ పోలీస్ బాస్ నండూరి సాంబశివరావు చెప్పుకొచ్చారు.
పోలీసు అధికారిగా తనకు ఉన్న అనుభవం ప్రకారం చెప్పాలంటే...ఆయా ప్రాంతాల్లో మావోయిస్టుల సానుభూతిపరులు కూడా ఉండకుండా ఉంటేనే ఆ ఫలానా ప్రాంతం సేఫ్ గా ఉందని చెప్పుకోవచ్చని నండూరి విశ్లేషించారు. సానుభూతిపరులు లేదా వారి కేడర్ ఉంటే ఎవరిపైనైనా దాడి చేయడానికి మావోయిస్టులకు సపోర్టు దొరుకుతుందన్నారు.
ఎప్పుడైతే క్షేత్ర స్థాయిలో మావోయిస్టులకు సపోర్టు దొరుకుతుందో...అప్పుడు ఆ ప్రాంతాల్లో వారి ప్రాబల్యం ఉన్నట్టే లెక్క అని నండూరి సాంబశివరావు వివరించారు. ఏదైనా సంఘటన జరిగితేనే అక్కడ మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నట్టు కాదని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో కూడా వారికి సానుభూతిపరులు లేకుండా చేయాలని, అప్పడే మావోయిస్టులు ప్రాబల్యం లేకుండా పోతుందని చెప్పారు. కాబట్టి మావోయిస్టు సానుభూతిపరులను మన వైపు తిప్పుకోవడమో లేకపోతే జనజీవన విధానంలో కలిసిపోయేలా చేయడం చాలా ముఖ్యమని మాజీ డిజిపి నండూరి సాంబశివరావు సూచించారు.
మరోవైపు మావోయిస్టులు ప్రజాప్రతినిధులను హతమార్చడం కాకుండా శాంతియుత మార్గంలో ప్రభుత్వంతో చర్చలకు రావాలని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రజాసేవ కోసం తాము ఎక్కడికైనా వెళతామని,అలా వెళ్లేప్పుడు దొంగదెబ్బతీసి చంపడం బాధాకరం అన్నారు.ప్రాణం తీసే హక్కు మావోయిస్టులకు ఎక్కడదని ఆయన ప్రశ్నించారు. గిరిజనుల కోసం పనిచేస్తామని చెబుతున్న మావోయిస్టులు గిరిజన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను ఎందుకు చంపారని నిలదీశారు. మరోవైపు ఏజెన్సీలో పోలీస్ వ్యవస్థ మరింత మెరుగ్గా పనిచెయ్యాల్సిన అవసరం ఉందని ఎంపీ అవంతి శ్రీనివాస్ పోలీస్ వర్గాలకు సూచించారు.