షాక్: కాశ్మీర్ వేర్పాటువాదులకు మద్దతుగా మావోయిస్టులు!
విశాఖపట్నం: కాశ్మీర్ వేర్పాటువాదులకు భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంత కమిటీ మద్దతు పలికింది. అంతేగాక, అక్కడి ప్రజలు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నామని, ప్రజాస్వామ్య వాదులు, ప్రగతిశీల శక్తులు ఇలాంటి ఉద్యమాలపై వాస్తవాలను ప్రచారం చేయాలని కోరింది.
ఈ మేరకు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు మావోయిస్టు కమిటీ రాజకీయ ప్రతినిధి జగబంధు పేరుతో ఓ లేఖను విడుదలైంది. కాశ్మీర్లో రిఫరెండం జరపాలని డిమాండ్ చేశారు. 21ఏళ్ల కాశ్మీర్ యువకుడు బుర్హాన్ వానీ, అతని ఇద్దరు అనుచరులను పోలీసు బలగాలు పట్టుకుని చంపేసి ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది మరణించాడని కట్టుకథలు చెప్పారన్నారని ఆరోపించారు.
వానీ మరణం తర్వాత కాశ్మీర్లో ఇప్పటివరకు భారత సైన్యం 100 మందికి పైగా పౌరులను హత్య చేసిందని, 10,000 మందిని గాయపడ్డారని పేర్కొన్నారు. కాశ్మీర్లోయ ఒక 'నిర్బంధ శిబిరం'గా మారిందన్నారు. మోడీ హయాంలో హిందూ సంస్థలు, బీజేపీ చేస్తున్న ప్రకటనలు అక్కడి ప్రజల్ని రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.
మోడీ ఎన్నికల హామీలన్నీ బుట్టదాఖలయ్యాయన్నారు. త్వరలో యూపీ, పంజాబ్లలో ఎన్నికలు, మరోవైపు పెరిగిన ధరలు, నిరుద్యోగం, దళితుల ఆందోళనలు మోడీ సర్కారును కుదిపేశాయని, దీంతో దేశప్రజల దృష్టి మరల్చేందుకు కాశ్మీర్ సమస్యను పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదమని ప్రచారం మొదలుపెట్టారని లేఖలో పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా, కాశ్మీర్ యూరి ప్రాంతంలో ఆదివారం ఉదయం సైనిక శిబిరంపై దాడి చేసిన ఉగ్రవాదులు.. 17మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారు. మరో ముగ్గురు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. సైన్యం కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవేట కొనసగుతోంది.