కిడారి, సోమలకు పట్టిన గతే: ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి మావోయిస్టుల స్ట్రాంగ్ వార్నింగ్
విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలకు సంబంధించి మావోయిస్టు సెంట్రల్ కమిటీ పేరుతో మంగళవారం విడుదలైన ఓ లేఖ కలకలం రేపుతోంది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ పేరుతో విడుదలైన ఆ లేఖలో టీడీపీకి చెందిన కిడారి, సోమ హత్యకు గల కారణాలను వెల్లడించారు.
గిరిజనులకు ద్రోహం చేస్తున్నందుకే..
గిరిజనులకు ద్రోహం చేస్తున్నందుకే ప్రజాకోర్టులో వారికి శిక్ష విధించామని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, గూడ క్వారీ విషయంలో ఎన్నోసార్లు వారిని హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదని వెల్లడించారు.
పోలీసులతో శుత్రుత్వం లేదు..
పోలీసులకు, తమకు ఎలాంటి శత్రుత్వం లేదని, అందుకే వాళ్లు తమకు ఆయుధాలతో దొరికినా ఎలాంటి హాని తలపెట్టలేదని వివరించారు. పొట్టకూటి కోసం ఉద్యోగం చేస్తున్న పోలీసులను క్షమించి వదిలిపెట్టామని తెలిపారు. కానీ, విప్లవసోదరులు దొరికితే మాత్రం పోలీసులు ఎన్కౌంటర్ చేస్తున్నారని పేర్కొన్నారు.
కిడారికి పట్టిన గతే.. గిడ్డి ఈశ్వరికి హెచ్చరిక
బాక్సైట్ తవ్వకాలకు ఎవరు అనుకూలంగా ఉన్నా వదిలేది లేదని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధికార పార్టీకి రూ.20 కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, పద్ధతి మార్చుకోకపోతే కిడారి, సోమకు పట్టిన గతే ఆమెకు పడుతుందని లేఖలో హెచ్చరించారు.
కలకలం రేపుతున్న మావోయిస్టలు హెచ్చరికలు
కాగా, ఇటీవల అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్యలతో పోలీసులు అప్రమత్తయ్యారు. తీవ్రస్థాయిలో కూంబింగ్ చేపట్టారు. అయితే, తాజాగా, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని హెచ్చరిస్తూ లేఖ రావడం ఈ ప్రాంతంలో అలజడి రేపుతోంది.