నియంతలు సూసైడ్ చేసుకునేవారు: జగన్పై మారెప్ప
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మారెప్ప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి అహంకారం, నియంతృత్వాన్ని చూసినట్లయితే హిట్లర్, ముస్సోలిని వంటి వారు ఆత్మహత్యకు పాల్పడే వారని ఆయన విమర్శించారు.
జగన్మోహన్ రెడ్డి అతని తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి లక్షణాలు రాలేదని అన్నారు.జగన్మోహన్ రెడ్డికి రాజకీయ అనుభవం ఏ మాత్రం లేదని తెలిపారు. పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జగన్ జైలు పాలయ్యారని ఆరోపించారు. గతంలో తెలంగాణకు అనుకూలమని చెప్పిన వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు.
తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని తెలిపారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మీయురాలైన కొండా సురేఖ లాంటి నేతలను జగన్మోహన్ రెడ్డి దూరం చేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి కోసం మానుకోటలో రాళ్ల దెబ్బలు తిన్న కొండా సురేఖను పట్టించుకోలేదని మారెప్ప పేర్కొన్నారు.
దళిత, గిరిజన నాయకులను యూజ్ అండ్ త్రో విధంగా జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నారని మారెప్ప తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీలో టిక్కెట్లు ఆశించిన చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని, తాను పిరికివాడిని అయితే ఇప్పటికే ఆత్మహత్య చేసుకునేవాడినని ఇటీవల తెలిపారు.